జమ్మికుంట, జూలై 9 : వావిలాల ఖాదీ పరిశ్రమకు పుట్టినిల్లు. 5వేల జనాభా ఉంటుంది. ఈ గ్రామం కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏన్నో ఏండ్ల నుంచి ఉన్నది. కానీ, ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. 2016లో రాష్ట్ర సర్కారు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో తమ వావివాల కూడా మండలంగా ఏర్పడుతుందని అంతా భావించినా నిరాశే ఎదురైంది. ప్రజలంతా ఒక్కటైనా.. దీక్షలు, ధర్నాలు చేసినా.. అప్పుడు మంత్రి, ప్రస్తుత బీజేపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పైగా జమ్మికుంట మండల కేంద్రానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న వావిలాలను వదిలేసి, కేవలం 5కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందకుంటను కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి ప్రజలంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
గత నెలలో ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో సంబురాలు చేసుకున్నారు. కొత్త మండలం కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ను వావిలాల ఎంపీటీసీ మర్రి మల్లేశం ఆధ్వర్యంలో గ్రామ నాయకులు కలిశారు. కొత్త మండలం ఏర్పాటు చేయించాలని విన్నవించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 22న వరంగల్ పర్యటనకు రాగా, వినోద్కుమార్, ఆరూరి రమేశ్ ఎంపీటీసీ మల్లేశానికి సీఎంను కలిసే అవకాశం కల్పించారు. అప్పుడు కడియం శ్రీహరి ఇంట్లో సీఎంను మల్లేశం కలిసి, వావిలాల మండలం చేయాలని విజ్ఞప్తి చేశాడు. వినతి పత్రాన్ని అందజేసి, నాడు తాము చేసిన ఉద్యమం, ఈటల అణిచివేసిన తీరు, తదితర అంశాలను వివరించాడు. సీఎం సానుకూలంగా స్పందించడంతో మల్లేశం సంబురపడ్డాడు. నాడు కొత్త మండలం కోసం ఉద్యమం చేసినా ఈటల రాజేందర్ పట్టించుకోలేదని, కానీ, సీఎం కేసీఆర్ ఏకంగా సమయం ఇవ్వడం గర్వంగా ఉందని గ్రామస్తులు సంతోషపడ్డారు. మండలం ఏర్పడినా.. ఏర్పడకున్నా పర్వాలేదనుకున్నారు.
మండల ఏర్పాటుకు సీఎస్తో మాట్లాడిన సీఎం..
ఇచ్చిన వినతి పత్రాన్ని అందరూ మరిచిపోయారు. కానీ, సీఎం కేసీఆర్ మరిచిపోలేదు. మర్రి మల్లేశం శ్రమా వృథా కాలేదు. జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పది రోజుల తర్వాత సీఎస్ సోమేశ్కుమార్తో మాట్లాడారు. ఈ మేరకు వావిలాల కొత్త మండలం ఏర్పాటుకు నివేదిక అందించాలని కలెక్టర్ శశాంకకు సీఎస్ ఈ నెల 6న లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, మండలం ఏర్పాటుకు అవసరమైతే సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సూచించారు. ఎంపీటీసీ మల్లేశానికి కూడా శుక్రవారం లేఖ అందగా, గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్, వినోద్కుమార్, ఆరూరి రమేశ్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. కాగా, సీఎస్ ఆదేశాలకు సంబంధించిన లేఖ ఎలాంటిది తనకు అందలేదని తహసీల్దార్ రాజిరెడ్డి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ దయే..
అప్పట్లో కొత్త మండలాలు వస్తున్నాయని సంబురపడ్డం. మా ఊరు మండలం అయితదని అనుకున్నం. అవకాశం ఉండే. అందుకే మండలం ఏర్పాటు కోసం అంతా ఒక్కటైనం. దీక్షలు చేసినం. ట్రాక్టర్లేసుకోని జమ్మికుంటకు వచ్చినం. ధర్నా, రాస్తారోకోలు ఎన్నోసార్లు చేసినం. ధూంధాం జేసినం. ఎన్నిజేసినా ఈటల రాజేందర్ పట్టించుకోలే. మండలం కానియ్యలే. ఇల్లందకుంటను జేసిండు. పార్టీ ఇడిసిన తర్వాత వినోద్, రమేశ్ సార్లు వరంగల్లో సీఎం సారును కలిపిచ్చిన్రు. ఇయ్యాల నివేదిక నాకచ్చింది. సంబురంగా ఉంది. రేపు మండలమైతే సీఎం కేసీఆర్ సారు దయే. ఆ సారుకు మేమంతా రుణపడి ఉంటం.