RTC Bus | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పండిట్ నెహ్రూ బస్టాండ్లో (Vijayawada) 12వ ప్లాట్ఫామ్పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ చేసిన తప్పిదానికి మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు పండిట్ నెహ్రూ బస్టాండ్లో 12వ ప్లాట్ఫామ్లో గుంటూరు వెళ్లేందుకు రెడీగా ఉంది. ఇక బస్సు స్టార్ట్ చేసిన డ్రైవర్ రివర్స్గేర్ వేయబోయి.. ఫస్ట్గేర్ వేశాడు. అంతే ఇంకేముందు.. బస్సు ఒక్కసారిగా ప్లాట్ఫామ్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్తోపాటు ఓ మహిళ, బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది బస్సుకింద నలిగి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ (CCTV footage )లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
CCTV footage of Vijaywada Bus Stand accident. pic.twitter.com/jQIYg7ze33
— Actual India (@ActualIndia) November 7, 2023
ఈ ఘటనలో మృతి చెందిన వారిని బస్సు కండక్టర్ వీరయ్య, ప్రయాణికురాలు కుమారి, ఆమె మనవడు అయాన్గా గుర్తించారు. కుమారి కోడలు సుకన్యకు కాలు విరిగిపోయింది. కాగా, డ్రైవర్ రివర్స్ గేరుకు బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని చెప్పారు. బస్సు కండిషన్ బాగానే ఉందని వెల్లడించారు. ఇది మానవ తప్పిదమా లేదా సాంకేతిక తప్పిదమా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, 24 గంటల్లోపు విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్ వయస్సు 61 ఏండ్లు అని, ఈ మధ్యే అనారోగ్యానికి గురై కోలుకుని డ్యూటీలో చేరాడని తెలిపారు. ఇక ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
Also Read..
Voice Of Reason | పోలీసు గుర్రం ప్రాణం తీసిన కోహ్లీ బర్త్డే సెలబ్రేషన్స్
Priyanka Gandhi | ప్రియాంక గాంధీని ఖాళీ బొకేతో ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు.. వీడియో వైరల్
Wipro | ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పిన విప్రో.. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే