Wipro | దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro) తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వర్క్ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది. ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ పద్ధతి (hybrid work policy)ని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు, మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టాప్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి. ఇప్పుడు విప్రో కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ మేరకు నవంబర్ 6వ తేదీన ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఈ ఆదేశాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే 55 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడుసార్లు ఆఫీసులకు వస్తున్నారు. అయితే మిగతా ఉద్యోగులు కూడా వర్క్ఫ్రమ్ హోమ్ను ముగించి హైబ్రిడ్ తరహలో ఆఫీసుల నుంచి పనిచేయాలని, దీని వల్ల వృత్తిపరమైన అభివృద్ధి ఉండటంతో పాటు సహోద్యోగులు, క్లయింట్లతో నేరుగా సంభాషిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని ఐటీ సంస్థ పేర్కొంది.
ఇక టీసీఎస్ (TCS) ఇప్పటికే వారానికి ఐదు రోజులు ఉద్యోగులు తప్పని సరిగా ఆఫీసుకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) కూడా వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతూ.. ఉద్యోగులు (Employees ) ఇకపై నెలకు 10 రోజులు కార్యాలయాలకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది.
Also Read..
Naga Chaitanya | భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తోంది.. రష్మిక మార్ఫింగ్ వీడియోపై నాగచైతన్య
Priyanka Gandhi | ప్రియాంక గాంధీని ఖాళీ బొకేతో ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు.. వీడియో వైరల్