యువ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం
పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ ద్వారా సత్వర అనుమతులు
రాయితీపై యూనిట్ల మంజూరు
గతేడాది భద్రాద్రి జిల్లాలో 296 యూనిట్లకు అనుమతులు
రూ.85 కోట్ల పెట్టుబడి.. 1,700 మందికి పైగా ఉపాధి
యువ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత
కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 26:యువ పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ ద్వారా సులభంగా అనుమతులు మంజూరు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతో పాటు వెనుకబడిన వర్గాలకూ చేయూతనిస్తున్నది. భద్రాద్రి జిల్లా పరిశ్రమలశాఖ గత ఆర్థిక సంవత్సరంలో 296 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసింది. అర్హులకు సకాలంలో యూనిట్లు మంజూరు చేసింది.
‘యువత యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.. వారు మరికొంతమందికి ఉపాధి కల్పించాలి..’ అన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ ద్వారా సులభంగా అనుమతులు మంజూరు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతో పాటు వెనుకబడిన వర్గాలకూ చేయూతనిస్తున్నది. రాయితీలతో రుణాలు మంజూరు చేస్తున్నది. గతేడాది కొవిడ్ కాలంలోనూ పరిశ్రమల ఏర్పాటుకు యూనిట్లు ఇచ్చింది.
గతేడాది 296 యూనిట్లు మంజూరు
భద్రాద్రి జిల్లా పరిశ్రమలశాఖ గత ఆర్థిక సంవత్సరంలో 296 పరిశ్రమలకు అనమతులు మంజూరు చేసింది. యువత యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే దృక్పథంతో మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాలను అమలు చేయిస్తున్నారు. గతేడాది జిల్లాలో పలువురు ఎగ్ ట్రేలు, పేపర్ ప్లేట్స్, అట్టలు, టైలరింగ్ ఇనిస్టిట్యూట్, రైస్ మిల్లు, ఎర్త్ మూవింగ్, ప్యాకింగ్ కంపెనీ, వాషింగ్ పౌడర్ తయారీ తదితర పరిశ్రమలు నెలకొల్పేందు దరఖాస్తు చేసుకున్నారు. అర్హులకు సకాలంలో రుణాలు అందించి పరిశ్రమలు నెలకొల్పేందుకు అధికారులు సహకరిస్తున్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ.65.07 కోట్ల పెట్టుబడులతో 99 యూనిట్లకు అనుమతులు ఇచ్చింది. ఈ యూనిట్ల ద్వారా 1,015 మందికి ఉపాధి దొరుకుతుంది.
టీ-ఐడియా, టీ -ప్రైడ్ ద్వారా ఉపాధి..
యువతను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్ ఇన్సెంటివ్ స్కీం (టీ-ఐడియా), తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంట్రప్రెన్యూర్ ఇన్సెంటీవ్ స్కీం(టీ-ప్రైడ్) వంటి పథకాలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహక రాయితీలు అందుతాయి. వారికి అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టీ-ప్రైడ్ పథకం ద్వారా పరిశ్రమలు, వాహనాలు, సేవారంగంలో ఎస్సీలకు 19 యూనిట్లకుగాను రూ.5.24 కోట్లతో 65 మందికి, ఎస్టీలకు 126 యూనిట్లకు గాను రూ.4.17 కోట్లతో 403 మందికి యూనిట్లు మంజూరు చేసింది. టీ-ఐడియా పథకం ద్వారా ఓసీ, బీసీలకు (జనరల్) 28యూనిట్లకుగాను రూ.8.79 కోట్లతో 150 మందికి యూనిట్లు మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం(పీఎంఈజీపీ) ద్వారా 24 మందికి రూ.86.31 లక్షలతో 72 మందికి రుణాలకు అనుమతులిచ్చింది.