నిర్మల్ టౌన్, డిసెంబర్ 26 : నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాగరబాయి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జడ్పీటీసీలు సమావేశమయ్యారు. రెండు, మూడు రోజులుగా జడ్పీ చైర్పర్సన్, ఆయా మండలాల ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానమంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని, కేసీఆర్ ఆదేశాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్నాయక్ నాయకులతో కలిసి పార్టీ పురోగతికి పాటు పడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు కళావతి, శ్రీనివాస్రెడ్డి, శారద, జానకీబాయి, రాజమణి, అరుగుమీది రామయ్య, సరోజిని భోజారెడ్డి, కొత్తపల్లి గంగామణి, అల్కాతాయి, ఓస రాజేశ్వర్, డాక్టర్ సుభాష్రావు, మాజీ జడ్పీ చైర్మన్ శ్యాంసుందర్ పాల్గొన్నారు.