దండేపల్లి, జనవరి 27 : జిల్లాలో యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. గతేడాది 1.04 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది ఇప్పటికే 62,524 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా వరి సాగవుతున్నది. ముందుగా కోతలు పూర్తయి.. నీటి వనరులున్నచోట ఇప్పటికే నాట్లు వేస్తుండగా, కోతలు ఆలస్యమైన చోట ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. సాధారణంగా వానకాలంలో సన్నరకాలు, యాసంగిలో దొడ్డు రకాలు సాగు చేసే రైతన్నలు ఈసారి మాత్రం సన్న రకాల వైపే మొగ్గు చూపారు. గతంలో వేసిన సన్నాలకు మంచి ధర రావడంతో ఆ వైపు మళ్లారు. యాసంగిలో పంటచేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన, తుఫాను తదితర ప్రకృతి వైపరీత్యాల సమస్య ఉంటుంది.
వీటిని తట్టుకునే స్వల్పకాలిక దొడ్డు రకాలపైనే రైతులు ఆధార పడేవారు. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వానకాలంలో రైతు లు ఎక్కువగా సన్నాలు సాగు చేయడంతో మంచి దిగుబడి వచ్చింది. దీంతో మార్కెట్ లో సన్నాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. క్వింటాలుకు రూ.2500 నుంచి రూ.3200 వరకు ధర లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర రావడంతో రైతులు యాసంగిలోనూ సన్నాలపైనే దృష్టి సారించారు. 120 రోజుల నుంచి 135 రోజుల్లో చేతికి వచ్చే స్వల్పకాలిక రకాలైన సాయిరాం, చిట్టిపొట్టి, అంకూర్ 101, జైశ్రీరాం తదితర రకాలను సాగు చేస్తున్నారు.
నీటి వనరులు అందుబాటులో లేని రైతులు, ఇండ్లకు దగ్గరకు ఉండే పొలాల్లో అక్కడక్కడా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అధికారులు ఆరుతడి పంటలు వేయాలని పదేపదే సూచిస్తున్నా రైతులు మాత్రం వరి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆరుతడి పంటలకు ప్రధానంగా అడవి పందుల బెడద, పంట చేతికి వచ్చే సమయంలో అమ్మేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కడెం ప్రధాన కాలువకు ఆనుకొని ఉన్న పంట పొలాల్లో వన్యప్రాణుల బెడద అధికంగా ఉండడంతో రైతన్నలు అరుతడి పంటల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఇంటికి సమీపంలో, నీటి సౌకర్యం తక్కువగా ఉన్నచోట తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
గతంలో ఒకటో డిస్ట్రీబ్యూటరీ నుంచి 29వ డిస్ట్రీబ్యూటరీ వరకు కడెం నీటిని అం దించగా, 30వ డిస్ట్రీబ్యూటరీ నుంచి చివరి వరకు గూడెం పథకం నుంచి నీటిని అందించేవారు. ఈసారి కడెంలో నీటిమట్టం తక్కువగా ఉండడంతో నీరు వదలడం లేదు. కేవ లం ఎత్తిపోతల నీటిపైనే రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నెల 6న గూడెం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. ఎక్కు వ విస్తీర్ణంలో వరిసాగైతే చివరలో సాగునీటికి ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, వీలైనం త ఎక్కువగా ఆరుతడి పంటలు వేసుకోవాల ని అధికారులు సూచిస్తున్నారు. కానీ రైతులు వరి సాగువైపే మక్కువ చూపుతున్నారు.