హాలియా, అక్టోబర్ 4 : సమైక్య రాష్ట్రంలో 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విద్యుత్ చీకట్లు అలుముకున్నాయి. స్వరాష్ట్రంలో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యాయి. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్ల కాలంలో రూ.586.88 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ హయాంలో రోజులో 8 గంటలు కూడా కరెంట్ సక్రమంగా ఉండేది కాదు. వ్యవసాయానికి ఉదయం 3 గంటలు, రాత్రి నాలుగు గంటలు ఇచ్చేవారు. ఇక పరిశ్రమలకు విద్యుత్ సరఫరా గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏనాడూ పరిశ్రమలకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేసిన దాఖలాలు లేవు. వారంలో ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, 2014లో స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు నేడు వ్యవసాయంతోపాటు గృహ, పారిశ్రామిక అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నాటి కాంగ్రెప్ పాలనలో రోజులో 24 గంటలు కరెంట్ ఉంటే వార్త.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 24 గంటల్లో ఒక్కగంట కరెంట్ పోతే వార్త అన్న చందంగా పరిస్థితి మారింది. స్వరాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరపరాతో ఇటు రైతాంగం, అటు వ్యాపారులు, పారిశ్రామిక వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండుగ అన్న రైతులే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగ అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో చూసినా విద్యుత్ లోఓల్టేజీ సమస్య ఉండేది. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తక్కువగా ఉండి మోటర్ కనెక్షన్లు ఎక్కువగా ఉండడంతో లోఓల్టేజీతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు, రైతుల మోటర్లు కాలిపోయేవి. పొలాలు ఎండిపోయేవి. ఏడాదిలో రెండు, మూడుసార్లు ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోవడంతో రైతులు వాటి రిపేర్ల కోసం వేల డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 4 గంటల కరెంట్తో రైతులు వ్యవసాయ సేద్యానికి ఇబ్బందిపడేవాళ్లు. ట్రాన్స్ఫార్మర్ రిపేర్కు 3 నుంచి 5 రోజుల సమయం పట్టడంతో పొలాలు నెర్రెలు బారేవి. కానీ, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో అవసరమైన చోట నూతన విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణంతో లోఓల్టేజీ సమస్యకు చెక్ పడింది. దీనికి తోడు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు ఆనందంగా వ్యవసాయం సాగు చేస్తున్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో రూ.586.88 కోట్లు ఖర్చు చేసింది. అందులో రూ.23 కోట్లతో అనుముల మండలం రామడుగు, హజారిగూడెం, తిరుమలగిరి(సాగర్) మండలంలోని అల్వాల, తిరుమలగిరి, త్రిపురారం మండలంలోని నీలాయగూడెం, పెద్దదేవులపల్లి, పెద్దవూర మండలంలోని పొట్టిచెలిమ, పర్వేదుల, కొత్తలూరు, నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామాల్లో మొత్తం 10 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒకటి 220 కేవీ, మరొకటి 132 కేవీ కాగా, మిగతా ఎనిమిది 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. రూ.9.7 కోట్లతో 15 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, రూ.93.29 కోట్లతో 8,133 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, రూ.13.9 కోట్లతో 164.95 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు, రూ.86.04 కోట్లతో 11కేవీ లైన్లు, రూ.93.35 కోట్లతో ఎల్టీ లైన్లు, రూ.151.15 కోట్లతో ఇతర పనులు చేయడం జరిగింది. అదే విధంగా నియోజకవర్గంలో 23,419 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.117.095 కోట్లు వెచ్చించారు.
నియోజకవర్గంలో గత దశాబ్దకాలంలో నూతన విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 75,649 మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా, నేడు ఆ సంఖ్య 1,28,170 మందికి చేరింది. అంటే కొత్తగా 50 వేల విద్యుత్ కనెక్షన్లు పెరిగాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో 70,891 మంది గృహ వినియోగదారులు, 8,318 కమర్షియల్ వినియోగదారులు, 474 పారిశ్రామిక వినియోగదారులు, 87 హెచ్టీ వినియోగదారులు, 2,189 ఇతర కేటగిరీల వినియోగదారులు ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు చెప్పనలవి కావు. అలాంటి పాలన మళ్లీ జీవితంలో రావద్దని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పాలనలో గృహ, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలకు ఏనాడూ కరెంట్ సమక్రంగా ఇచ్చిన దాఖాలలు లేవు. పగటిపూట కరెంట్ లేక ఉడకపోతతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. రాత్రిపూట కరెంట్ కోసం పొలం దగ్గర జాగారం చేసేవాళ్లం. ఏ రోజు కూడా సక్రమంగా కరెంట్ వచ్చిన దాఖలాలు లేవు.
-వెంకట్రామిరెడ్డి, రైతు, రామడుగు
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంటుతో వడ్రంగులమంతా ఆనందంగా జీవిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంటు సక్రమంగా ఉండేది కాదు. ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేది. నాడు పని లేక పస్తులుండే పరిస్థితి. కానీ, నేడు ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం మూలంగా చేతి నిండా పని ఉంది. పనికి తగ్గ ఆదాయం కూడా వస్తుంది. భార్యా బిడ్డలతో ఆనందంగా జీవిస్తున్నాం.
-బ్రహ్మచారి, వడ్రంగి, హాలియా
దార్శనికత కలిగిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 40 ఏండ్లుగా అలుముకున్న విద్యుత్ చీకట్లను పారదోలారు. గడిచిన తొమ్మిదేండ్లలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రూ.586.85 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాంతంలో ఉన్న విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగింది. వ్యవసాయంతోపాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగానికి 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైన రాష్ట్రంలో దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే.
-నోముల భగత్కుమార్, ఎమ్మెల్యే