ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 21 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఎన్నికల వేళ విమర్శలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీలకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో చాంద(టీ), భీంసరి, అర్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ జోగు రామన్నకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు ప్రమోద్ భానుకర్ ఆధ్వర్యంలో మంగ్లీ, భీంసరి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామంటూ బూటకపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రెండు వేల కోట్లను మాత్రమే కేటాయించిన బీజేపీ బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఆ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని, ఆదిలాబాద్లో ఆయన బీసీల గురించి మాట్లాడడం విడ్డూరమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార శైలిపై ధ్వజమెత్తిన జోగు రామన్న వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు సైతం సంక్షేమ పథకాల ఫలాలు అందిన విషయాన్ని గుర్తు చేశారు. నోట్ల సంచులతో టికెట్టు కొనుక్కున్న కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిన వెంటనే తన దారిని తాను చూసుకుంటాడని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ పరిధిలో రూ.12 కోట్ల నిధులతో ఆలయాల అభివృద్ధి, నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి భూ కబ్జాల గురించి, ఆయన చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరోసారి అవకాశం కల్పించండి
ఆదిలాబాద్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలను చూసి మరోసారి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరారు. ప్రచారంలో భాగంగాలో మంగళవారం పట్టణంలో ప్రధాన మార్కెట్, బట్టలషాపులు, కిరణాషాపు, జనరల్ స్టోర్లు, పూలు, పండ్ల షాపులలో, కూరగాయల మార్కెట్లో కరపత్రాలు ఇచ్చి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో దుకాణాదారులు జోగు రామన్నకు సాధరంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు స్వరూపరాణి, వార్డు కౌన్సిలర్ ప్రకాశ్, బీఆర్ఎస్ నాయకులు కరుణా,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వండి…
ఎదులాపురం, నవంబర్ 21 : ఆదిలాబాద్లో జరగనున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న సీపీఎంను కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలతో కలిసి సమవేశమయ్యారు. ప్రసుత్త రాజకీయ పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. తమకు పార్టీ పరంగా మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరాగా జిల్లా కమిటీ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నారు. సమావేశంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రి, అన్నమొల్ల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.