“నడి ఎండకాలంలోనూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వేసవి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు బాగా వినియోగిస్తున్నారు. అయినా డిమాండ్కు అనుగుణంగా కరెంటు ఇస్తున్నాం.. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా 1.6 మిలియన్ యూనిట్లు.. 30 వేల వ్యసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా 70 లక్షల యూనిట్ల అవసరం ఉంది. ఇండ్లకు అంతరాయం కలుగకుండా 50 ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. గాలి దుమారంతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తుండడం వల్ల విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదమున్నది. పశువుల కాపరులు, ఇండ్లలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే అధికారులకు తెలపాలి.” అని ఎన్పీడీసీఎల్ ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ సంపత్కుమార్ వెల్లడించారు. ఆయన ‘నమస్తే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ)
‘జిల్లాలో మండు వేసవిలోనూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాం..’ అని అన్నారు ఎన్పీడీసీఎల్ ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ కే సంపత్కుమార్. రోజూ గృహ అవసరాలు, పంపుసెట్లకు అవసరమయ్యే విద్యుత్ డిమాండ్ మేరకు అందిస్తున్నామన్నారు. గాలిదుమారం కారణంగా విద్యుత్తీగలు తెగిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సరఫరాలో ఇబ్బందులుంటే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని, సొంతంగా పనులు చేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 27 ( నమస్తే తెలంగాణ)
నమస్తే తెలంగాణ : విద్యుత్ ప్రమాదాలపై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..
ఎస్ఈ సంపత్కుమార్ : కరెంటు వాడకంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి? కరెంటు రెండు గంటలు లేకపోయినా ఇబ్బందులు ఉండవు. తెలిసీతెలియక కరెంటు పనులు చేస్తే షాక్ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇండ్లలో, వ్యవసాయ విద్యుత్ మోటార్ల వద్ద విద్యుత్ వాడకంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. తీగలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. షాక్ వచ్చే ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీటర్ల వద్ద ఫీజులను గానీ, తీగలను గానీ తాకవద్దు. ఎండాకాలంలో కూలర్లలో నీరు పోసేటప్పుడు కరెంటు తీసివేయాలి. ఇండ్లలో, వ్యవసాయబోర్ల వద్ద సమస్యలు వస్తే విద్యుత్ అధికారులకు గానీ సిబ్బందికి గానీ సమాచారం ఇవ్వాలి. వారు సమస్యను పరిష్కరించి కరెంటు వచ్చేలా చేస్తారు.
నమస్తే : పంట పొలాల వద్ద ప్రమాదాలు జరుగకుండా ఏం చేయాలి?
ఎస్ఈ : గాలి, దుమారం కారణంగా విద్యుత్ వైర్లు తెగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో రైతులు జాగ్రత్తలు పాటించాలి. తమ పంట పొలాల్లో కరెంటు లైన్ల తీగలు సరిగా ఉన్నాయా.. లేదా.. చూసుకోవాలి. తీగలకు దూరంగా ఉంటూ పశువులను అటువైపుగా వెళ్లకుండా చూసుకోవాలి. వైర్లు కిందికి వంగినా, తెగిపోయినా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలి. కొందరు రైతులు తమ పంటలకు జంతువుల నుంచి రక్షణగా ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు. దీని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంబాలు, స్టే వైర్లకు దూరంగా ఉండాలి.
నమస్తే : జిల్లాలో విద్యుత్ డిమాండ్ మేరకు సరఫరా జరుగుతున్నదా?
ఎస్ఈ : ఎండాకాలంలో కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తారు. దీంతో డిమాండ్ బాగా పెరుగుతుంది. జిల్లాలో 2 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు, 30 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. గృహ అవసరాలకు రోజూ 1.6 మిలియన్ యూనిట్లు, వ్యవసాయానికి 70 లక్షల యూనిట్ల అవసరం ఉంది. కాగా, డిమాండ్ మేరకు సరఫరా జరుగుతున్నది. ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 24 గంటల విద్యుత్ సరఫరాతో రైతులు యాసంగి పంటలను సాగు చేస్తున్నారు. గృహ అవసరాలకు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల్లేకుండా 50 ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్లర్లు ఏర్పాటు చేశాం.
నమస్తే : గాలి, దుమారం కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్ఈ : గాలి, దుమారం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టెషన్ల మెయింటనెన్స్ పనులను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నాం. ప్రకృతి వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, సరఫరాను పునరుద్ధరిస్తున్నాం. ప్రజలు విద్యుత్ను వృథా చేయకుండా అవసరాల మేరకు వినియోగించుకోవాలని కోరుతున్నా.