మంచిర్యాల, మార్చి 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల కురిసిన అకాల వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జొన్న, మొక్కజొన్న, పొగాకు, కంది, నువ్వులు, మిరప, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు, ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చే దశలో ఉన్న జొన్న, మొక్కజొన్న కండ్ల ముందే నేలమట్టమయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నేలకొరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లింది. నాలుగైదు రోజులపాటు కురిసిన వర్షాలతో ఈ రెండు జిల్లాలో దాదాపు 2,477 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిళ్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.
జొన్న రైతులకు నష్టం
నాకు ముంజంపల్లిలో 5.20 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఈ యేడాది మిర్చి వేశా. పంట బాగానే వచ్చింది. కానీ.. గత మంగళవారం రాత్రి సమయంలో వడగండ్ల వాన కురువడంతో కోసి ఎండబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. అదేవిధంగా చెట్టుపై ఉన్న మిర్చి కూడా పూర్తిగా రాలి.. నాణ్యత తగ్గింది. కొనుగోలుదారులు ధర పెట్టడం లేదు. తద్వారా నేను పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో నాకు సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– తుమ్మిడె శంకర్, ముంజంపల్లి, రైతు
ఆరుగాలం కష్టపడి పంట చేతికందే సమయంలో అకాల వర్షం దెబ్బతీసింది. నేను నాకున్న రెండెకరాల్లో మిర్చి వేశా. పెట్టుబడిని పెద్ద మొత్తంలో పెట్టి పంట బాగానే రావడంతో మురిసి పోయా. కానీ.. వడగండ్ల వానతో ఆరబెట్టిన పంట తడిసి రంగు మారి నల్లబడింది. నాణ్యత కోల్పోవడంతో అనుకున్న ధర రాక నిరాశే మిగిలింది. రంగు మారిన మిర్చితో కొనుగోలు చేసే వారు కూడా తక్కువ ధర పెడతామంటున్నారు. నాకు సుమారు రూ.1.5 లక్షల నష్టం వాటిల్లింది. నష్టంపై ప్రభుత్వం సర్వేలు నిర్వహించాలి. పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నా.
– ఆబీద్ ఖాన్, కుకుడ, రైతు