Telangana | రాష్ట్ర సర్కారు విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కోట్ల రూపాయలతో అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. ‘మన ఊరు-మన బడి’ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడంతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూల్స్ను తలపిస్తున్నాయి. గురుకులాలు, మోడల్, కేజీబీవీ వంటి వాటిని స్థాపించి విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేస్తున్నది. కాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పుస్తకాలతోపాటు యూనిఫామ్స్ను కూడా అందిస్తున్నది. ఏటా యూనిఫామ్స్ బడులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు చేరేవి. దీనిని అధిగమించడానికి ఎండాకాలంలోనే క్లాత్ను బడులకు చేరవేస్తే.. బడులు ప్రారంభమయ్యే సరికి స్టిచ్చింగ్ అవుతాయని విద్యాశాఖ భావిస్తున్నది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు క్లాత్ రాగా.. 23న నిర్మల్ జిల్లాకు, 26న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు రానుంది.
సోన్/ఎదులాపురం, మార్చి 16 : 2023-24 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు నూతన యూనిఫాంలు అందించాలని రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అందించాలని ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. గత జూన్లో యూనిఫాంలు పంపిణీని ప్రారంభిస్తే.. ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందాయి. దీనిని అధిగమించడానికి జూన్ ప్రారంభం నాటికే యూనిఫామ్స్తో విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లా కేంద్రానికి యూనిఫాం దుస్తులు చేరుకోగా.. మండలాలవారీగా విభజించి ఎమ్మార్సీ కేంద్రాలకు పంపించనున్నారు. అక్కడి నుంచి హెచ్ఎంలకు చేరనున్నాయి. ఈ వేసవి చివరినాటికి కొలతలు తీసుకొని దర్జీల వద్ద కుట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 54,227 మంది విద్యార్థులు 2,67,055 మీటర్లు, మంచిర్యాల జిల్లాలోని 805 బడుల్లోని 45,309 మంది విద్యార్థులకు 2,32,750 మీటర్ల క్లాత్ను కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లాకు 12వ తేదీన 69,303 మంది విద్యార్థులకు 3,37,567 మీటర్ల క్లాత్ వచ్చింద. నిర్మల్ జిల్లాకు 23వ తేదీన 54,227 మంది విద్యార్థులకు 2,67,054 మీటర్లు, 26వ తేదీన మంచిర్యాలతోపాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు 48,982 మంది విద్యార్థులకు 2,30,825.55 మీటర్ల క్లాత్ రానుంది. విద్యార్థులను తరగతులు, వయస్సువారీగా విభజించి ఐదు రకాలుగా వివిధ డిజైన్లలో స్ట్రిచింగ్ చేయించేలా కసరత్తు చేస్తున్నారు. మోడల్ స్ట్రిచింగ్ డిజైన్లను పాఠశాల విద్యాశాఖ జిల్లాలకు పంపించింది. ఈ క్లాత్ను రాష్ట్ర చేనేత సహకార సంస్థ(టెస్కో) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేయించి, పాఠశాల విద్యార్థులకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు అందించింది. కొత్త యూనిఫామ్స్తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరగవచ్చని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. వచ్చే యేడాది బడి ప్రారంభానికల్లా యూనిఫామ్స్ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అధికారులు తెలిపారు.