పెద్దపల్లిలో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు కదిలాయి. వందలాది ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు ‘జై తెలంగాణ.. జైజై కేసీఆర్ నినాదాలతో ముందుకు సాగగా, వీధులన్నీ మారుమోగాయి. ఫ్లెక్సీలు, జెండా లతో రహదారులన్నీ గులాబీమయమమ్యాయి. బెల్లంపల్లిలోని క్యాంపు కార్యాల యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, శ్రీరాంపూర్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
మంచిర్యాల, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వలలో సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో నుంచి వందలాది వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. బెల్లంపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు.
నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి సుమారు 5 వేల మంది శ్రేణులు వెళ్లారు. శ్రీరాంపూర్ నుంచి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, మహిళలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలారు. దారి పొడవునా జై తెలంగాణ.. జైజై కేసీఆర్ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. దారులన్నీ ఫ్లెక్సీలు, జెండాలతో గులాబీ మయమయ్యాయి.