Indervelly | అమాయక గిరిజనుల నెత్తురు చిందిన ఇంద్రవెల్లి ఘటనకు నేటి(గురువారం)తో 42 ఏండ్లు పూర్తయ్యింది 1981, ఏప్రిల్ 20న నాటి ప్రభుత్వం జరిపిన దమనకాండ ఆదివాసుల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోయింది. సమైక్య పాలకుల తీరుతో నాటి అమరులకు కనీసం నివాళులర్పించలేకపోయిన జనం, స్వరాష్ట్రంలో స్వేచ్ఛగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. ఏడేళ్లుగా అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనం నివాళులర్పిస్తుండగా, నేటి వేడుకలు, బహిరంగ సభకూ సర్వం సిద్ధం చేసింది.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 19 : ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినోత్సవం గురువారం నిర్వహించేందుకు ఆదివాసీ గిరిజనం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నది. నాడు సమైక్య పాలకుల నియంతృత్వం కారణంగా కనీసం నివాళులర్పించలేకపోయిన ఈ ప్రాంత జనం, నేడు స్వచ్ఛందంగా అమర వీరుల స్తూపం వద్దకు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. ఏటా ఏప్రిల్ 20న అమరవీరుల స్తూపం వద్ద పోలీసులు విధిస్తున్న 144 సెక్షన్ను స్వరాష్ట్రం ఏర్పడ్డాక సర్కారు కొంత సడలించడంతో గిరిజనం తరలివచ్చి నాటి చేదు ఘటనను గుర్తు చేసుకుంటున్నది.
తమ హక్కుల కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించింది. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో అనేక మంది గిరిపుత్రులు నేలకొరిగారు. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ చెరిగిపోవడం లేదు. ఈ ఘటనతో ఇంద్రవెల్లి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. నాడు వ్యాపారులు, అధికారుల చేతుల్లో దోపిడికి గురైన గిరిజనం ఉద్యమానికి సిద్ధమైంది. దీంతో గిరిజన గూడెల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో గిరిజన సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. ఈ క్రమంలో గిరిజనులు అడవుల్లో ఖాళీగా ఉన్న భూములను దున్నడం ప్రారంభించారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించకపోవడంతో పలు సంఘాల ఆధ్వర్యంలో 1981, ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. దీనికి నాటి ప్రభుత్వం అనుమతించలేదు. అయినా గిరిజన సంఘాల వెనక్కి తగ్గలేదు.
1981, ఏప్రిల్ 20న సోమవారం ఉదయం నాలుగు దిక్కుల నుంచి ఆడామగ, చిన్నాపెద్ద తేడా లేకుండా గిరిజనులు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. ఇంద్రవెల్లి అంతా గిరిజనులతో నిండిపోయింది. సమావేశం అడ్డుకునేందుకు నాటి పోలీసులు విశ్వప్రయత్నం చేశా రు. వాహనాలు రాకుండా రహదారులను దిగ్భంధించారు. కానీ గిరిజనులు మాత్రం తాడోపేడో తేల్చుకోవాలని కసితో ఉన్నారు. ఈ క్రమంలో వేలాదిమందితో వస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఓ జవాన్ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి జవాన్పై చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేసిం ది. అంతే ఆ జవాన్ నేలకొరిగాడు. ఇంతలోనే పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు తుపాకులకు పని చెప్పారు. తుపాకుల శబ్ధం తో ఇంద్రవెల్లి దద్దరిల్లిపోయింది. పచ్చని చెట్లు ఎర్రగా మారాయి. గోండుల రక్తం భూమిపై ఏరులై పారింది. వందలాది మంది గిరిజనులు ఆరుపులు కేకలతో వాగుల వెంట పరుగులు తీశారు.
పీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో గిరిజనులు ఏర్పాటు చేసుకున్న సమావేశం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. కాల్పుల్లో 13 మంది అమాయక గిరిజనులు మృత్యువాత పడ్డారు. నాడు గాయాలతో బయటపడ్డ కొందరు ఆ తర్వాతి కాలంలో మృతి చెందగా, మరి కొందరు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఏప్రిల్ 20 వచ్చిందంటే చాలు ఈ సంఘటనను గుర్తు చేసుకొని భయంతో వణికిపోతుంటారు. కాల్పుల ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య పిట్టబొంగురం గ్రామాన్ని సందర్శించి చలించిపోయారు. భాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హమీనిచ్చారు. భూమి, ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తామని భరోసానిచ్చారు.
కాల్పుల ఘటనకు సాక్షిగా నాడు ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్ గ్రామం వద్ద రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో అమరవీరులు స్తూపం ఏర్పాటు చేశారు. ఏటా ఏప్రిల్ 20న గిరిజనులు నివాళులర్పిస్తుంటారు. కానీ 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు డైనమైట్లతో కూల్చివేశారు. దీంతో గిరిజనుల్లో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగించడానికి అప్పటి ప్రభుత్వం 1987లో ప్రభుత్వ నిధులతో స్మారక స్తూపాన్ని నిర్మించింది. అయితే స్తూపం వద్దకు గిరిజనులను అనుమతించడానికి మాత్రం పోలీసులు నిరాకరిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏప్రిల్ 18-20 మూడు రోజులపాటు ఉట్నూర్ రహదారిని దిగ్భంధించేవారు. ఈ సారి మాత్రం అలాంటి ఆంక్షలు విధించకుండా పోలీసులు స్తూపం పరిసర ప్రాంతాల్లో మాత్రమే 144 సెక్షన్ విధించారు.