బజార్హత్నూర్/బోథ్/నేరడిగొండ/ఖానాపూర్ రూరల్/భైంసాటౌన్ : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం వదలడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 52.2 మిల్లీ మీటర్లు.., నిర్మల్ జిల్లాలో 57.8 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సిరికొండ మండలంలో 19.5 సెంటీ మీటర్లు, ఇచ్చోడలో 17.3 సెంటీ మీటర్లు, ఇంద్రవెల్లిలో 12.4 సెంటీ మీటర్లు.., కుంటాల మండలంలో 12.46 సెంటీ మీటర్లు, కుభీర్లో 99.2 మిల్లీ మీటర్లు, తానూర్లో 78.6, బాసర్లో 45, ముథోల్లో 94.6, భైంసాలో 59.6, లోకేశ్వరంలో 38, నర్సాపూర్ (జీ)లో 24.4, దిలావర్పూర్లో 41.8, సారంగాపూర్లో 116.2, నిర్మల్లో 44.8, నిర్మల్ రూరల్ మండలంలో 28.8, సోన్లో 19.8, లక్ష్మణచాందలో 16.2, మామడలో 65.2, పెంబిలో 67.6, ఖానాపూర్లో 37.8, కడెంలో 62.4, దస్తూరాబాద్ మండలంలో 34.2 మిల్లీ మీటర్లుగా నమోదైంది. బజార్హత్నూర్ మండలంలోని కడెం నదిపై గల కనకాయ జలపాతం కనువిందు చేస్తున్నది. దట్టమైన అటవీ ప్రాంతంలో పక్షుల కిలకిలరావాల నడుమ ఎత్తైన ప్రదేశం నుంచి పాల పొంగులా జాలువారే నీటిని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. బోథ్ మండలం పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. జలపాతం వద్ద నీరు ఎగిసి పడుతున్నది. మధ్యలో ఉన్న బండరాళ్లు కనిపించకుండా ఉధృతంగా ప్రవహిస్తున్నది.
దీంతో అటవీశాఖ అధికారులు మూడు రోజుల పాటు సందర్శకులు రావద్దని సూచిస్తున్నారు. నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి వరద పోటెత్తింది. బోథ్, నేరడింగొండ, ఇచ్చోడ, బజార్హత్నూర్ మండలాల్లో కురిసిన వర్షాలకు జలపాతం ఉగ్రరూపం దాల్చింది. పర్యాటకులు రాకుండా అటవీ శాఖ అధికారులు ముందుగానే చర్యలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులతో పాటు సదర్మాట్ ఆనకట్టకు వరద భారీగా వచ్చిచేరింది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 696.250 అడుగులకు నీరు చేరింది. 1,86,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా, 13 గేట్లను తెరచి 1,62,200 క్యూసెక్కుల నీటిని దిగువు వదులుతున్నారు. ఖానాపూర్ మండలం మేడంపల్లి సదర్మాట్ ఆనకట్టకు వరద భారీగా వస్తున్నది. నీటి మట్టం 7.6 అడుగులుగా ఉండగా, రాతి గోడపై నుంచి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం నీటి మట్టం 8.5 అడుగులుగా నమోదైనట్లు జేఈ ఉదయ్ కుమార్ తెలిపారు. సందర్శనకు పర్యాటకుల తాకిడి పెరిగింది. భైంసా మండలం గుండేగాం వద్ద నిర్మించిన రంగారావుపల్సికర్ ప్రాజెక్టు నిండింది. దీంతో అక్కడ నిర్మించిన బ్రిడ్జీపై నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో మహాగాం, పార్డీ(బీ), మహారాష్ట్రలోని గ్రామాలకు రాపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో కొండ చిలువ హల్చల్ చేసింది. కాలనీకి చెందిన కిరణ్ ఇంటి పరిసరాల్లో 6 ఫీట్ల పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ అనీల్ దానిని బంధించి, అటవీ ప్రాంతంలో వదిలేశారు.
నిర్మల్ టౌన్, జూలై 21 : జిల్లాలో కురుస్తున్న భారీ వర్సాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని స్వర్ణవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సిద్ధాపూర్ లోలెవల్ బ్రిడ్జి ప్రాంతాన్ని, స్థానిక కాలనీని సందర్వించారు. చర్యలపై అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. చెరువులు, వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు అటువైపు వెళ్లవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ మోహన్, సిబ్బంది జమాల్ తదితరులు ఉన్నారు.