నిర్మల్ అర్బన్, జులై 12 : రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు బడుల్లో విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పాటు నుంచి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విద్యారంగం.. స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో సాగుతున్నది. అందుకు కోట్లాది రూపాయల నిధులను బడ్జెట్లో కేటాయించి, ప్రక్షాళన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియం చదువుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతుండడంతో ‘మన ఊరు-మన బడి’తో పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. పేద విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేందుకు రెండు జతల యూనిఫాంలను అందిస్తున్నది.
జిల్లాలో 59,608 మందికి లబ్ధి..
నిర్మల్ జిల్లాలో 735 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు, గురుకులాలు, కేజీబీవీలు, మైనార్టీ రెసిడెన్షియల్, ఆదర్శ పాఠశాలలతో పాటు, అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 59,608 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతంలో ఒక్కో చోట ఒక్కో విధంగా విద్యార్థులకు యూనిఫాం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల్లో ఒకే తరహా యూనిఫాంను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విద్యాశాఖ నిర్మల్ జిల్లాలో 90 శాతం మందికి రెండు జతల యూనిఫాంల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 47,686 మంది విద్యార్థులకు అందించింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాం పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.
అన్నీ ఉచితమే..
సర్కారు బడిలో నాణ్యమైన విద్య అందించడంతో పాటు, విద్యార్థులందరికీ ప్రభుత్వం సన్నబియ్యంతో కూడిన రుచికరమైన భోజనం అందిస్తున్నది. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం అందిచడం చాలా సంతోషంగా ఉంది. పాఠశాలలో చేరినప్పటి నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చదువుకుంటున్న. సర్కారు అన్నీ ఉచితంగా అందించడం ఆనందంగా ఉంది.
– సింధూజ, 7వ తరగతి, కేజీబీవీ, పెంబి
90 శాతం పంపిణీ పూర్తి..
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల 68 వేల 814 మీటర్ల క్లాత్ అందించింది. ఇందులో దాదాపు 59,608 మంది విద్యార్థులకు గాను, ఇప్పటి వరకు 47,686 మందికి రెండు జతల యూనిఫామ్స్ అందించాం. త్వరలోనే మిగతా 12 వేల మందికి అందిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి.
– రవీందర్ రెడ్డి, డీఈవో, నిర్మల్