‘కోడి కూయకముందే.. ఊరు లేవకముందే..’ అంటూ శ్రమజీవి కష్టాన్ని వివరిస్తూ ఓ కవి రాసిన ఈ పాట పారిశుధ్య కార్మికులకూ అచ్చంగా సరిపోతుంది. ఎండనకా.. వాననకా.. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయక స్వచ్ఛత కోసం అలుపెరగకుండా పనిచేస్తుంటారు. తెల్లవారకముందే విధులకు హాజరై రోడ్లు ఊడ్చి.. తడి, పొడి చెత్తను సేకరించి డంప్యార్డులకు తరలిస్తుంటారు. కళావిహీనంగా ఉన్న కాలనీలను అందంగా తీర్చిదిద్దుతారు. ఎంతటి విపత్కర పరిస్థితులెదురైనా సేవలందిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తారు. ఇక ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి చలికి గడ్డకట్టుకుపోయే పరిస్థితి నెలకొనగా, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా విధులు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్న మున్సిపల్ సిబ్బందిపై ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్కారు పల్లెలు, పట్టణాలను ‘స్వచ్ఛ’ంగా తీర్చిదిద్దుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, సినిమా థియేటర్లు, కూరగాయల మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో చెత్తా చెదారం పేరుకుపోతుంది. ప్రజలు వినియోగించే వస్తువులు, ఆహార పదార్థాల నుంచి వచ్చే వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతుంటాయి. పారిశుధ్య కార్మికులు ఒక్కరోజు పని చేయకపోయినా అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. వీధులన్నీ కంపు కొడుతాయి. వ్యాధులు చుట్టుముడుతాయి. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సమాజ శ్రేయస్సుకోసం సేవలు అందిస్తుంటారు పారిశుధ్య కార్మికులు. ఎండ.. వాన, చలిని సైతం లెక్క చేయకుండా పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. కరోనా సమయంలోనూ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మేమున్నామంటూ భరోసానిచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికాలం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ప్రస్తుతం 10 డిగ్రీల కంటే తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇంతటి ఎముకలు కొరికే చలిలో సైతం సమాజశ్రేయస్సు కోసం సేవలందిస్తున్నారు పారిశుధ్య కార్మికులు. పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పి.. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడం కోసం అలుపెరగకుండా పారిశుధ్య కార్మికులు పనులు చేస్తుంటారు. ఉదయం 5 గంటలకే రోడ్లపైకి చేరి పారిశుధ్య పనుల్లో నిమగ్నమవుతున్నారు. కాలనీలు, రోడ్లు ఊడుస్తూ.. కళావిహీనంగా ఉన్న పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వాహనాల్లో వేస్తున్నారు. మురుగు కాలువలను సైతం శుభ్రం చేస్తున్నారు. మంచుకురిసే వేళలో రోడ్లు సరిగా కనిపించక.. వాహనాలతో ప్రమాదం పొంచి ఉన్నా.. పనులు చేపడుతుంటారు. అధికారులు సైతం చలిని తట్టుకుని కార్మికులు పనుల పర్యవేక్షిస్తున్నారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 374 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మున్సిపాలిటీలో 158 మంది, నిర్మల్లోని మూడు మున్సిపాలిటీల్లో 402, మంచిర్యాలలోని ఏడు మున్సిపాలిటీల్లో 74 మంది పర్మినెంట్, 721 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి వేతనాలను పెంచడమేగాక అనేక సౌకర్యాలు కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో చాలీచాలనీ వేతనాలతో పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వీరి నెల సరి వేతనాన్ని రూ.12 వేలకు పెంచింది. వీరి సేవలకుగానూ రెండేళ్ల కిందట మరోసారి రూ.15,600కు పెంచింది. వీటితో పాటు బూట్లు, కోట్లు, హెల్మెట్లు, గ్లౌవ్స్లు, రెయిన్ కోట్లు అందజేసింది. కార్మికులకు ఫీఎఫ్ సౌకర్యం కల్పించింది. తమ సేవలను గుర్తించి తగిన వేతనాలు ఇవ్వడంపై పారిశుధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు హాజరు వేసుకుంటా. ఆ తర్వాత పని ప్రారంభిస్తా. ఈ 15 రోజుల నుంచి చలిబాగా పెరిగింది. మంచుకూడా పడుతుంది. వచ్చీపోయే వాహనాలు కూడా కనిపించడం లేదు. స్వెటర్లు, మఫ్లర్లు, మంకీక్యాపులు ధరించి పనులు చేస్తాం. అధికారుల సూచనల మేరకు విధులు నిర్వహిస్తాం. ఉదయం చెత్తగా ఉన్న రోడ్లు శుభ్రం చేసిన తర్వాత చూస్తే మంచిగా అనిపిస్తుంది.
– మెరుగు చిరంజీవి, పారిశుధ్య కార్మికుడు, ఆదిలాబాద్, మున్సిపాలిటీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశుధ్య కార్మికుల వేతనం రూ.10,400 ఉండే. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2016లో రూ.12,500.. జూన్ 2020లో రూ.15,600లకు పెంచారు. అలాగే బూట్లు, కోట్లు, హెల్మెట్లు, గ్లౌవ్స్లు, రెయిన్ కోట్లు అందజేస్తున్నారు. కార్మికులకు ఫీఎఫ్ సౌకర్యం కూడా కల్పించారు.
కాగజ్నగర్టౌన్, నవంబర్ 27 : 25 ఏండ్లుగా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న. ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు వచ్చి హాజరు వేసుకుంట. ఆ తర్వాత తోటి కార్మికులతో కలిసి పని చేస్త. తడి,పొడి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తీసుకెళ్తా. మధ్యాహ్నం ఒంటిగంటకు పని ముగించుకొని ఇంటికి వెళ్త. ఏ కాలమైనా ఉదయం లేవడం అలవాటే.
– నిట్టూరి వెంకటేశ్, మున్సిపల్ కార్మికుడు, కాగజ్నగర్
లక్షెట్టిపేట, నవంబర్27 : ఇప్పుడు చలి ఘోరంగా ఉంది. గడ్డకట్టుకపోయేటట్లు పెడుతుంది. ఒక్కొక్కరు పొద్దెక్కెదాంక లేస్తలేరు. గిట్లా చలికి భయపడి ఇంట్లో ఉంటే ప్రజలు ఇబ్బందులు పడుతరు. అందుకే ఉదయం నాలుగింటికే లేచి పనికి పోత. తోటి కార్మికులతో కలిసి వాడలన్నీ శుభ్రం చేస్త. కరోనా సమయంలో కూడా మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు చేసినం. ప్రభుత్వం, అధికారులు మమ్ముల మస్తు మొచ్చుకున్నరు. జీతాలు కూడా పెంచిన్రు.
– బడుగు లింగయ్య, పారిశుధ్య కార్మికుడు, లక్షెట్టిపేట
ప్రతి రోజూ ఉదయం ఐదింటికే డ్యూటీలో ఉంటా. మున్సిపాలిటీ వాహనంతో రోడ్లపై తిరుగుతూ చెత్తను సేకరిస్తాం. తడి,పొడి చెత్తను సేకరించి డంప్యార్డుకు తరలిస్తాం. ఈ మధ్య చలి మస్తు పెరిగింది. ఎంత చలి ఉన్నా పని చేయాల్సిందే కదా. మేము ఒక్కరోజు పనిచేయకపోతే కాలనీలు కంపు కొడుతాయి. మా సేవలకు తగిన గుర్తింపు ఇచ్చింది టీఆర్ఎస్ సర్కారే. – సాయి, వాహనం డ్రైవర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ
ఉమ్మడి రాష్ట్రంలో మాకు తక్కువ జీతం లభించేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు మా సేవలను గుర్తించి రెండుసార్లు వేతనాలు పెంచిం ది. నేను పది సంవత్సారాల నుంచి పని చేస్తున్నా. అప్పుడు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో తక్కువ వార్డులు ఉండేవి. ఇప్పుడు వార్డులు పెరగడంతో పాటు కార్మికులను కూడా ప్రభుత్వం నియమించింది. ఉదయం చలి ఎక్కువగా ఉంటుంది. స్వెటర్ వేసుకొని పనిచేస్త.
– దుల్దాస్ బీపిన్, కార్మికుడు, ఆదిలాబాద్, మున్సిపాలిటీ
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉన్నాయి. 374 మంది కార్మికులు పని చేస్తారు. రోజూ 77 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. పారిశుధ్య సిబ్బంది రోజూ మున్సిపాలిటీలో బయోమెట్రిక్ విధానంలో హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు రోడ్లు, వీధులను శుభ్రం చేస్తారు. అనంతరం మురుగు కాల్వలు శుభ్రపరుస్తారు. జిల్లాలో యేటా చలికాలంలో 3 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చలిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తారు. పట్టణంలోని క్షేత్రస్థాయిలో పర్యటించి కార్మికులు పనితీరును సమీక్షిస్తాం. అపరిశుభ్రతపై ఫిర్యాదులు వస్తే పరిష్కరిస్తాం.
– నరేందర్, సానిటరీ ఇన్ స్పెక్టర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 15 ఏండ్ల సంది పనిచేస్తున్న. అప్పుడు జీతం రూ.1300 ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో మమ్ముల పట్టించుకున్నోళ్లు లేరు. జీతాలు మస్తు తక్కువగా ఉండే. అప్పులు చేయాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సార్ మా పనితనాన్ని గుర్తించి జీతం పెంచిన్రు. ఇప్పుడు నెలకు రూ.15,600 ఇస్తున్నరు. ఫీఎఫ్ కట్ అవుతుంది. ఈ మధ్య మస్తు చలి పెరిగింది. అట్లాని ఇంట్లో ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతారు. అందుకే ఎంత తిప్పలైనా ఉదయాన్నే పనికి పోత. తోటి కార్మికులతో కలిసి వీధులు శుభ్రం చేస్తా.
– సత్యనారాయణ, మున్సిపల్ కార్మికుడు (ఆదిలాబాద్)