నవీపేట/నందిపేట్/ఖలీల్వాడి, ఆగస్టు 18: పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక శాఖలోనే కొనసాగించాలని, జీవో నంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సం ఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నందిపేట్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా, నవీపేటలో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో తహసీల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు మాట్లాడుతూ.. ఐటీఐ, డిప్లొమా విద్యను ఒకే వ్యవస్థలో విలీనం చేయడంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు సాంకేతిక నైపుణ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, అధ్యాపకుల కొరత వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు, ప్రభుత్వం తీసుకునే కళాశాలల విలీనంతో నాణ్యమైన విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు తలెత్తనున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నిపుణులైన ఫ్యాకల్టీని నియమించి సాంకేతిక విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు కర్క గణేశ్, రేహాన్, చరణ్, ఆల్గోట్ సృజన్, ఆయాన్, రామ్చరణ్,శాన్, శృతి, వైష్ణవి, సురేశ్, సాయి విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం..
సాంకేతిక విద్య ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నట్లు పీడీఎస్యూ నగర అధ్యక్షుడు పవన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోహిత్, శ్రీజన్, వర్షిణి, శ్రీనిధి పాల్గొన్నారు.