పల్లెల్లో పఠనాసక్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నది. నిరుపయోగంగా ఉన్న భవనాలను గుర్తించి మరమ్మతు చేస్తున్నది. ప్రభుత్వం రూ.లక్ష కేటాయిస్తుండగా.. నిధులు సరిపోని యెడల మరో రూ.2 లక్షల వరకు మంజూరు చేస్తున్నది. ఈ నిధులతో అందమైన, ఆకర్షణీయమైన బొమ్మలు వేయిస్తున్నది. మంచిర్యాల జిల్లాలో ఐదు చోట్ల ఏర్పాటు చేయగా.. ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. అన్ని వసతులు కల్పించి, బుక్స్, పీరియాడికల్, మ్యాగజైన్స్ను అందుబాటులో ఉంచనున్నది. నిర్వహణకు నెలకు రూ.2 వేలు కేటాయిస్తున్నది. వీటిలో రూ.1000 దినపత్రికలకు, మరో రూ.1000 గ్రంథాలయ నిర్వాహకుడికి పారితోషికం అందజేయనున్నది. తాజాగా.. తాళ్లపెల్లి లైబ్రరీని శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, అడిషనల్ కలెక్టర్ రాహుల్ ప్రారంభించారు.
– దండేపల్లి, జూన్ 28
దండేపల్లి, జూన్ 28 : పల్లెల్లో పఠన సంస్కృతి(రీడింగ్ కల్చర్) ప్రోత్సహించడానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. పౌరుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ లైబ్రరీలను నెలకొల్పుతున్నది. నిరూపయోగంగా ఉన్న భవనాలకు మరమ్మతులు చేపట్టి, వాటిలో పౌర పఠన మందిరాలను ఏర్పాటు చేస్తున్నది. హాజీపూర్, మందమర్రి మండలాల్లోని అందుగులపేట, కన్నెపల్లి, లక్షెట్టిపేట మండలంలోని అంకత్పెల్లి, దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో ఇటీవలే లైబ్రరీలను ప్రారంభించింది. తాళ్లపేటలో నిరూపయోగంగా ఉన్న జీసీసీ భవనాన్ని రూ.3.50 లక్షలతో మరమ్మతులు చేసి లైబ్రరీగా మార్చింది. దీనిని శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, అడిషనల్ కలెక్టర్ రాహుల్ ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఐదు లైబ్రరీలను ప్రారంభిం చగా, రెండో విడుతలో మరిన్ని ప్రారంభించ నున్నారు. మూడో విడుత వచ్చే సరికి ప్రతి జీపీలో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం.
అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ
మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ రాహుల్ ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ భవనాలను నూతన లైబ్రరీలకు వినియోగిస్తున్నారు. ఒక్కో లైబ్రరీకి రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. నిధులు సరిపోని చోట అదనంగా మరో రూ.2 లక్షల ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. గ్రంథాలయంలో పుస్తకాలు, పీరియాడికల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ ఉండడంతో కేవలం నెల వ్యవధిలోనే పాత ప్రభుత్వ భవనాలు లైబ్రరీలుగా మారుతున్నాయి.
అన్ని వసతులు
గ్రంథాలయాల్లో అన్ని వసతులు కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. టేబుళ్లు, కుర్చీలు, లైట్లు ఏర్పాట్లు చేశారు. అన్ని వయస్సుల వారు చదువుకునేలా లైబ్రరీలను తీర్చిదిద్దుతున్నారు. ప్రారంభమైన చోట విద్యార్థులు, యువకులు చదు వుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్స్ జారీ చేస్తున్న నేప థ్యంలో నిరుద్యోగులకు ఉపయోగపడుతున్నాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున నిధులు కేటాయిస్తున్నది. వీటిలో రూ.1000 దినప త్రికలకు, మరో రూ.1000 గ్రంథాలయ నిర్వాహకుడికి పారితోషికం అందజేస్తారు. మండల కేంద్రాల్లోని లైబ్రరీల నుంచి నవలలు, సాహిత్యం, సమాచార పుస్తకాలను సరఫరా చేయనున్నారు. ప్రతి నెల 50 వరకు పుస్తకాలను తీసుకెళ్లి, భద్రంగా తిరిగి ఇచ్చిన తర్వాత మరికొన్ని ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగనుంది. పాఠకుల అభిరుచి మేరకు పుస్తకాలు కొనుగోలు చేయనున్నారు.
ఉద్యోగార్థులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న లైబ్రరీలను ఉద్యోగార్థులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానంలో నిలవాలని పట్టణాలకు పంపిస్తున్నారు. కానీ.. సర్కారు లైబ్రరీలు ఏర్పాటు చేస్తుండడంతో లక్షల ఫీజులు చెల్లించి చదువుకునే పరిస్థితి తప్పింది. నిరుద్యోగులకు చేరువయ్యేందుకు లైబ్రరీలు ఉపయోగపడతాయి. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంది. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలి.
– ఆకుల రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ.