ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. ఇంతకముందు ఒకసారి పోస్టులు భర్తీ చేయగా.. రెండోసారి కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ఆర్థికశాఖ అనుమతులు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 5,089 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 792 పోస్టులు మంజూరయ్యాయి. నాలుగు కేటగిరీల్లో పోస్టులు ఉండనుండగా.. మూడు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా జిల్లా సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) ద్వారా పోస్టులు భర్తీ చేయాలని చూస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు పరీక్షలు కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
– మంచిర్యాల, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర సర్కారు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపికబురు అందించింది. రెండో డీఎస్సీ ద్వారా విద్యాశాఖలో 5,089 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్థికశాఖ శుక్రవారం ఇందుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంపై ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ), ఎస్జీటీలు, పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్లు ఇలా నాలుగు కేటగిరీల్లో జిల్లాలవారీగా పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లకు రెండు రోజులపాటు, ఎస్జీటీలకు ఒక రోజు మొత్తం మూడు రోజులపాటు పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు పరీక్షలు కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. డీఎస్సీ ఎగ్జామ్ను 160 ప్రశ్నలు, 80 మార్కులకు నిర్వహించనున్నారు.
గతంలో టెట్ క్వాలిఫై అయిన వారికి 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల, పరీక్ష నిర్వహణ రాష్ట్రస్థాయిలోనే మానిటర్ కానుండగా, జిల్లాలవారీగా మెరిట్, సెలక్షన్ జాబితాను విడుదల చేయనున్నారు. టీఎస్పీఎస్సీ కాకుండా జిల్లా సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) ఈ పోస్టులను భర్తీ చేయనుంది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అది కుదరని పక్షంలో ఆఫ్లైన్లోనూ పరీక్ష రాసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు కేటగిరీల్లో 792 పోస్టులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ పోస్టుకు సిద్ధం అవుతున్నా..
ఆసిఫాబాద్, ఆగస్టు 27 : ప్రభుత్వం ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తున్నది. దీంతో మా వంటి వారికి ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి కచ్చితంగా టీచర్ పోస్టు సాధిస్తాననే నమ్మకం ఉంది.
– యెనగందులు స్వాతి, డీఎడ్ అభ్యర్థి, ఆసిఫాబాద్
కచ్చితంగా ఉద్యోగం సాధిస్తా..
నిర్మల్ అర్బన్, ఆగస్టు 27 : మాది నిర్మల్ పట్టణం. 2015 సంవత్సరంలో బీఈడీ పూర్తి చేశా. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండోసారి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయడం. నిర్మల్ జిల్లాలో మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనుంది. ఈసారి నిర్వహించే డీఎస్సీ పరీక్షలో తప్పకుండా ఉద్యోగం సాధిస్తా. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవుతున్నా.
– అజాస్, బీఈడీ అభ్యర్థి, నిర్మల్
సంతోషంగా ఉంది..
నిర్మల్ అర్బన్, ఆగస్టు 27 : మాది కాల్వ గ్రామం. నేను 2018లో టీటీసీ పూర్తి చేశా. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్లను వెల్లడించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఈసారి ప్రభుత్వం ఆన్లైన్లో పరీక్షను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
– జాదవ్ సంతోష్, టీటీసీ అభ్యర్థి