కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్తి చేసింది. తాజాగా 9168 పోస్టులతో గ్రూప్-4 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీంతో నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ప్రిపరేషన్లో భాగంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువత ఎన్నడూ లేని విధంగా వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో ఆనందంలో మునిగితేలుతున్నది. ఇక ఇదే అనువైన సమయమని భావించి కొలువు కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. కాగా, ఈనెల 23 నుంచి గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కసరత్తు చేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాది సాదించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎస్ఐ. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించి ప్రిలిమినరీ పరీక్షను పూర్తి చేసింది. త్వరలోనే శారీరక దారుఢ్య పరీక్ష, మెయిన్స్ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు గ్రూప్ 1లో ఐదొందుల పైచిలుకు పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసింది. త్వరలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైనల్ కీ కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఇదిలా ఉంటే గ్రూప్ 4 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9168 పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. ఇలా దశల వారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. డిగ్రీ, పీజీ, బీటెక్, చదివిన ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల కోసం నగరాలకు పరుగులు తీస్తుండగా, ఇప్పటికే ప్రిపిరేషన్లో ఉన్న నిరుద్యోగులు మరోసారి లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సమయం వచ్చిందని సంతోషపడుతున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 4 నోటిఫికేషన్లో నిర్మల్ జిల్లా నుంచి పలు శాఖల వారీగా దాదాపు 250 పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఖాళీల్లో పాఠశాల విద్యాశాఖలో 286, రెవెన్యూ శాఖలో 99, సంక్షేమ శాఖలో 45, మున్సిపల్ శాఖలో 30, మహిళా శిశు సంక్షేమ శాఖలో 16, ఇతర శాఖల్లో 135 పోస్టులు భర్తీ కానుండగా జోనల్ స్థాయిలో కూడా అభ్యర్థులు పోటీ పడే ఉద్యోగాలు సైతం ఉన్నాయి. వీటన్నింటితో నిర్మల్ జిల్లాలో 250 పై చిలుకు పోస్టులు భర్తీ కానున్నాయి. వీటి భర్తీ కోసం ప్రభుత్వం ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుండగా, వచ్చే నెల 12 వరకు చివరి తేదీగా పేర్కొంది. పరీక్షను మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించనుంది.
గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం గ్రంథాలయాలన్నీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారితో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్, టీఆర్టీ, గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాలకు, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ పోస్టులకు సన్నద్ధమవుతుండగా, తాజాగా గ్రూప్ 4 నోటిఫికేషన్ వెలువడడం రానున్న రోజుల్లో గ్రూప్ 2,3 పోస్టులకు నోటిఫికేషన్ రానుండడంతో ఇప్పటి నుంచే అభ్యర్థులు ప్రిపరేషన్ సాగిస్తున్నారు. అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండడంతో నిరుద్యోగ అభ్యర్థులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
గ్రూప్ 2 జూనియర్ లెక్చరర్ పోస్టుల ఉద్యోగానికి సన్నద్ధం అవుతున్నాను. సబ్జెక్టుపై, జనరల్ స్టడీస్పై పట్టు సాధించేందుకు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపేరవుతున్న. జనరల్ స్టడీస్ అన్ని పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తుండడంతో జూనియర్ లెక్చరల్ పోస్టుల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ కూడా వస్తుందని అనుకుంటున్న..
– చౌహాన్ జోత్స్న, నిర్మల్
ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదువుతున్న. ఇక ఇప్పుడు సీరియస్ ప్రిపరేషన్ ఎంతో అవసరం. ఇంట్లో ఉండి చదువలేని వారికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న. గ్రంథాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది. వారందరితో పోటీపడి చదవాలనిపిస్తుంది. దీంతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
– సీహెచ్ నిరోష, నిర్మల్
ప్రభుత్వం నిరుద్యోగుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. 9168 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ముందుకు రావడం ఎందరికో మేలు చేసినట్లవుతుంది. ఖాళీలు స్థానికులకు ఇచ్చేందుకే నిర్ణయించి, భర్తీ ప్రక్రియ చేపట్టడం ఆనందంగా ఉంది.
– ఆర్ లవకుశ, కుభీర్
ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్ఐ, నోటిఫికేషన్లతో పాటు తాజాగా గ్రూప్ 4 నోటిఫికేషన్ను విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు నిరుద్యోగులంతా రుణపడి ఉంటారు. వీటితో పాటు త్వరలో గ్రూప్ 2,3 నోటిఫికేషన్ను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులంతా సంబురాల్లో మునిగితేలుతున్నారు. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. నిరుద్యోగులెవరూ దళారులను ఆశ్రయించవద్దు.
– వుజురం మహేశ్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్