ఖలీల్వాడి, జూలై 9: ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కొనసాగుతున్నది. అయితే ఈ ‘సర్’ ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ నుంచి తిరిగి వాటిని ఇచ్చే వరకు అనేక సందేహాలు, అనుమానాలతో ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఎన్యూమరేషన్ ఫారంలో ఒక కాలమ్లో 2002 సంవత్సరానికి సంబంధించి ఓటర్లు కార్డు వివరాలను పూర్తిచేయాలని పేర్కొన్నారు. దీనిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపడం ఒక సవాలుగా మారింది. 2002లో ఓటు హక్కు ఉన్నవారిలో చాలా మంది వద్ద ఇప్పుడు ఓటర్ ఐడీ కార్డులు లేవు. కొంత మంది ఇతర జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చారు.
వారు ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. అయితే 2002లో ఇక్కడలేని వారి పరిస్థితి ఏంటనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. 2002లో కంఠేశ్వర్లో ఉన్నవారు ప్రస్తుతం శివాజీనగర్కు వచ్చారు. వారు ఎక్కడికి వెళ్లాలి..వారికి ఇంతవరకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొన్నది. కొందరికి ప్రస్తుతం ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా, ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. వారు ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారు. ఒకవేళ ఫోన్ నంబర్లు మారితే వారి పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే 2002 ఓటరు గుర్తింపు కార్డు వివరాలు అడగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని, ‘సర్’ కార్యక్రమాన్ని పొడిగించాలని కోరుతున్నారు.
సిబ్బంది ఎక్కడ?
సర్ ప్రక్రియపై శిక్షణ పొందినవారిలో బీఎల్వోలతోపాటు అంగన్వాడీలు, ఆశ కార్యర్తలు, ఫీల్డ్ ఆఫీసర్లతోపాటు మెప్మా లోన్ లీడర్లు ఉండడం గమనార్హం. అయితే వీరందరూ ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలో వివరించాలి. అవసరమైతే తామే నింపాలి. కానీ వీరు ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ పాఠశాలలు తదితర ప్రాంతాల్లో కూర్చుంటున్నారు. అక్కడి నుంచే ఫోన్ చేసి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి తీసుకురావాలంటూ చెబుతున్నారు.
కనిపించని వృద్ధుల పేర్లు
ఓటరు జాబితాలో కొంతమంది తల్లిదండ్రుల పేర్లు లేవు. దీంతో అయోమయానికి గురవుతున్నారు. 2002లో చాలా మంది వృద్ధుల పేర్లు కనిపించడంలేదు. వారి వారసులు ప్రస్తుతం ఉన్నా, ఎన్యూమరేషన్ ఫారంలో వారి తల్లిదండ్రుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే తమకేమీ తెలియదని సమాధానమిస్తున్నారు.
తిరిగి ఇచ్చింది ఎంతమంది!
బీఎల్వోలు కష్టపడి ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్నది. కొంతమంది అధికారుల వద్దకే వచ్చి ఫారాలు తీసుకెళ్లారు. కానీ ఇప్పటివరకు చాలా మంది ఫారాలను తిరిగి ఇవ్వలేదు. ఫారం నింపడంలో అనేక సందేహాలు తలెత్తడమే కారణమని తెలుస్తోంది. మరోవైపు ఫారంపై ఫొటో అంటించాల్సి ఉండడంతో ఫొటో స్టూడియోలకు గిరాకీ పెరిగింది.