ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉగ్రభానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. వారం రోజులుగా టెంపరేచర్ 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో 44.3, నిర్మల్లో 43.8, మంచిర్యాలలో 43.6, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 42.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి.
ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎండతీవ్రత అధికంగా ఉంటున్నది. రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలతోపాటు వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ బారినపడకుండా శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాన్లు, కూలర్ల కింద ఉపశమనం పొందుతున్నారు. పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
– ఆదిలాబాద్, మే 13(నమస్తే తెలంగాణ)
మాడు పగులుతంది..
ఎండలు బాగున్నయ్. మాడు పగులుతంది.చేను వద్దకు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు అక్కడే ఉండా ల్సి వస్తున్నది. మధ్యాహ్నం అయితే చెట్ల కింద కూర్చుంటు న్నం. వారం రోజులకు ముందు వానలు కొట్టాయి. నాలుగైదు రోజుల నుంచి ఎండలు బాగా ఉండడంతో దగడు వస్తున్నది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నం. చల్లదనం కోసం కూలర్ల కింద కూర్చుంటున్నం. పెండ్లిళ్లు, ప్రయాణాలకు వెళ్లే వారు రద్దు చేసుకుంటున్నారు.
– సిల్వర్ చిన్నయ్య, రైతు, కరంజి(టీ), భీంపూర్ మండలం