కేంద్ర సర్కారు ఆధీనంలో నడుస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లను విస్మరించింది. నాలుగు నెలల క్రితం కేంద్రాలు ఏర్పాటు చేసి, వాణిజ్య కొనుగోళ్లు కూడా చేపడుతామని ప్రకటించినా కిలో పత్తి కూడా కొనలేదు. ప్రైవేట్ వ్యాపారులతో పోటీపడి మద్దతు ధర కంటే అధికంగా చెల్లిస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కూడా నిర్వహించినా.. స్పందన కానరావడం లేదు. ఆదుకోవాల్సిన సంస్థ కొనకపోవడం.. తమను మోసం చేయడమేనని రైతులు పేర్కొంటున్నారు.
– ఆదిలాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధికంగా పత్తి సాగవుతుంది. గతేడాది 3.52 లక్షల ఎకరాల్లో సాగవగా.. 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు రైతులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు కూడా చేశారు. క్వింటాలుకు మద్దతు ధర రూ.6,380 ఉండగా.. సీజన్ ప్రారంభంలోనే ప్రైవేట్ వ్యాపారులు రికార్డు స్థాయిలో రూ.8,500 చెల్లించి కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. ఆదిలాబాద్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతేడాదితో పోల్చితే అమ్మకాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ధర పెరుగుతుందమే ధీమాతో పంటను మార్కెట్కు తీసుకురావడం లేదు. కొన్ని రోజులుగా క్వింటాలు ధర రూ.7,500 నుంచి రూ.7,750 మధ్య కొనసాగుతోంది. కొందరు వివిధ మార్కెట్ యార్డుల్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తుండగా.. కొంతమంది మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.
సీసీఐ ఉన్నా ఫలితం సున్నా..
కేంద్ర పరిధిలో ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రైతులు వద్ద నుంచి పత్తిని సేకరిస్తుంది. రైతులు పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఈ సంస్థపై ఉంది. ఇది రెండు విధాలుగా కొనుగోళ్లు చేస్తుంది. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో పంటను సేకరిస్తుంది. రెండో విధానంలో భాగంగా మద్దతు ధరతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యాపారులతో పోటీపడి రైతులకు లాభం వచ్చేలా వాణిజ్య కొనుగోళ్లు చేస్తుంది. జిల్లాలో మాత్రం సీసీఐ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు నెలల కిందట ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కమర్షియల్ కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ ఇప్పటి వరకు పంటను సేకరించలేదు. ప్రైవేటు వ్యాపారులు ఇస్తున్న రేటును ఇవ్వడం లేదు. కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆదుకోవాల్సిన సంస్థ తక్కువ ధర చెల్లించడం.. తమను మోసం చేయడమే అని రైతులు అంటున్నారు.
కేంద్రానికి రైతుల ఉసురు తగులుద్ది..
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు ఈ యేడాది కిలో పత్తి కూడా కొనలేదు. అంతా ప్రైవేటోళ్లే అధిక ధర ఇచ్చి కొంటున్నరు. సీసీఐ అధికారులు మార్కెట్ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. అసలు రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అన్నదాతల ఉసురు కేంద్ర ప్రభుత్వానికి తగులుద్ది.
– చింతల లచ్చారెడ్డి, రైతు, కరంజి(టీ), భీంపూర్ మండలం.