మోర్తాడ్, ఆగస్టు 4: ఎస్సారెస్పీ వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈసారి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని అధికారులు చెప్పడంతో విద్యుత్ ఉత్పత్తిపై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్లో ఆశించిన స్థాయిలో నీరు వచ్చి, కాకతీయ కాలువకు నీటివిడుదల కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం మేరకు కొనసాగే అవకాశం ఉన్నది.
విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 67 మిలియన్ యూనిట్లు
పోచంపాడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈ సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 67 మిలియన్ యూనిట్లుగా నిర్ణయించారు. ప్రాజెక్ట్లోని నీటిమట్టం, ఇన్ఫ్లో ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని 60-90మిలియన్ యూనిట్ల వరకు నిర్ణయిస్తారు. ఈసారి 67యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏప్రిల్ నెలలో కాకతీయ కాలువకు నీటివిడుదల కొనసాగడంతో ఆ సమయంలో 5.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి జరగలేదు. పోచంపాడ్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్లను విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేయగా, ఒక్కో యూనిట్లో 9 మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తి చేసే అవకాశం ఉంటుంది.
అంటే నాలుగింటి ద్వారా 36 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. గతేడాది కూడా 67 మిలియన్ యూనిట్ల లక్ష్యంగా నిర్దేశించగా,దాదాపుగా డబుల్ 122.8మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. కాకతీయ కాలువకు రెండు వేల క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగినప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. రెండు వేల క్యూసెక్కుల నీటివిడుదలకు ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రాజెక్ట్ చరిత్రలో 2004-05లో కేవలం 1.663 మిలియన్ యూనిట్లు, 2009-10లో 2.542 మిలియన్ యూనిట్లు, 2014-15లో 12.8 మిలియన్ యూనిట్లు అతితక్కువగా విద్యుత్ ఉత్పత్తయిన సంవత్సరాలుగా నమోదయ్యాయి. ఐదేండ్లుగా లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
కాకతీయకు నీటి విడుదల కొనసాగితే ఉత్పత్తి ప్రారంభిస్తాం
ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు రెండు వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగితే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తాం. ఐదారేండ్లుగా లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈసారి కూడా వర్షాలు కురిసి ప్రాజెక్ట్ నిండి కాకతీయ కాలువ ద్వారా నీటివిడుదల కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరడానికి కృషి చేస్తాం.
– శ్రీనివాస్, డీఈ, జెన్కో
వివిధ సంవత్సరాల్లో నమోదైన విద్యుత్ ఉత్పతి వివరాలు
సంవత్సరం : విద్యుత్ ఉత్పత్తి (మిలియన్ యూనిట్లలో)
2021-22లో: 109.8
2022-23లో: 138.9
2023-24లో: 75.8
2024-25లో: 66.7
2025-26లో: 122.8
ఈ సంవత్సరం లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందా, లేదా అనేది ప్రాజెక్ట్లోకి వచ్చే వరద పై ఆధారపడి ఉంది.