మంచిర్యాల, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు నిర్మల్ జిల్లా ప్రజానీకం నీరాజనం పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగా, బహిరంగ సభకు సుమారు లక్షమందికిపైగా తరలివచ్చారు. నిర్మల్ పట్టణంతో పాటు సభా ప్రాంగణం, పార్టీ కార్యాలయం, కలెక్టరేట్కు పోయే దారులన్నీ గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో నిండిపోయాయి. శనివారం రాత్రే పట్టణం మొత్తం గులాబీమయమైపోయింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల నుంచి వేలాది మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భారీగా సభకు తరలివచ్చారు. ఎల్లపెల్లి శివారులో ముఖ్యమంత్రి బహిరంగ సభ సాయంత్రం ఉండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచే జనం రాక మొదలైంది. సీఎం వచ్చే సమయానికి ప్రాంగణం మొత్తం జనసంద్రమై కనిపించింది. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్.. నినాదాలతో మార్మోగిపోయింది.
ప్రత్యేక వాహనాల్లో తరలింపు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సభకు ప్రజలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. టీఎస్ఆర్టీసీ నుంచి నిర్మల్, భైంసా, నిజామాబాద్-2, మెట్పల్లి, కోరుట్ల, ఆర్మూర్ డిపోల నుంచి 200 బస్సులను పంపించారు. ప్రైవేటు వాహనాలు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, కార్లలో వేలాది మంది తరలివచ్చారు. యువకులు మోటార్ సైకిళ్లపై ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆర్మూర్ నాలుగు రోడ్ల నుంచి జనం తండోపతండాలుగా తరలిరావడంతో, ఆ రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి కనిపించాయి. మహిళలు, రైతులు గులాబీ కండువాలు వేసుకొని సభకు వచ్చారు. వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
ప్రాంగణంలో సకల సౌకర్యాలు..
బహిరంగ సభాప్రాంగణంలో జనం ఇబ్బందు లు పడకుండా చర్యలు తీసుకున్నారు. ప్రాంగణం లో ఉన్న వారు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించేలా వేదిక మీద భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జనం గ్యాలరీల్లో కుర్చీలు, ఏసీ కూలర్లు, తాగునీరు, మజ్జిగ అందించారు. ప్రాంగణం మొత్తాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. జనం ఇబ్బందులు పడకుండా పోలీసులు సమన్వయం చేశారు.