ఆదిలాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసిం ది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లను దాఖలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చివరిరోజు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 25 వరకు కొనసాగింది. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏడు రోజులపాటు అధికారులు నామినేషన్లను స్వీకరించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా అత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి అత్రం సుగుణ, బీజేపీ నుంచి నగేశ్లు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని వస్తారని ఆ పార్టీ నేతలు భావించినా ఆయన బహిరంగ సభకు హాజరయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పలువురు నామినేషన్లు వేశారు. నేడు(శుక్రవారం) రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరగనుంది.