కుభీర్, అక్టోబర్ 5 : నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం 41 గ్రామ పంచాయతీ(జీపీ)లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద మండలంగా ఉంది. దీనికితోడు తండాలు, అనుబంధ గ్రామాలు కలుపుకుని 70కి పైగా గ్రామాలు ఉన్నాయి. విశాలంగా ఉండడం, చాలా గ్రామాలు మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో పరిపాలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో నాలుగేళ్లుగా మాలేగావ్ గ్రామాన్ని మండలం చేయాలంటూ 13 జీపీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు సంతకాల సేకరణ చేస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మంత్రి ఐకేరెడ్డిలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
దీనికితోడు మాలేగాం మాజీ సర్పంచ్ కచ్చకాయల శంకర్, ప్రస్తుత సర్పంచ్ మహిపాల్, నిగ్వ, కుప్టి, గోడాపూర్, హంపోలి గ్రామాల సర్పంచ్లు ఎమ్మెల్యే విఠల్రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యే, మంత్రి కలిసి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ కొత్త మండలం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ను కూడా కలిసి కొత్త మండలం ఆవశ్యకతను తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు గత మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం మాలేగావ్ను మండలం చేస్తూ ప్రాథమిక నోటిపికేషన్ను జారీ చేసింది. తమ డిమాండ్ను నెరవేర్చిన ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కేటీఆర్, సీఎం కేసీఆర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
13 జీపీలు ఇవే..
మాలేగావ్ కొత్త మండలంలో 13 పంచాయతీలతోపాటు ఆరు అనుబంధ గ్రామాలు ఉండనున్నాయి. సాంవ్లి, న్యూ సాంవ్లి, సౌన, హంపోలి(బీ), మోల, అంతర్ని, పాంగ్ర, గోడ్సర, సొనారి, నిగ్వ, మాలేగావ్, గోడాపూర్, కుప్టి, అనుబంధ గ్రామాలు పాంగర్పాడ్, అంతర్ని తండా, బాకోట్, వర్ని, వాయి, లింగితో కొత్త మండలం ఏర్పాటు కానుంది.
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే..
సాంవ్లి గ్రామం కుభీర్ మండల కేంద్రానికి చాలా దూరం ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం 13 జీపీల సర్పంచ్లం తీర్మానాలు, సంతకాల సేకరణ చేసి ఎమ్మెల్యేకు అందజేశాం. మంత్రి అల్లోలతోపాటు సీఎం సార్ దృష్టికి తీసుకెళ్లి కొత్త మండలం అయ్యేట్లు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మాలేగావ్ కొత్త మండలం అయింది.
– రేకుల గంగాచరణ్, మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్, సాంవ్లి.
కల నెరవేరింది..
నాలుగేండ్లుగా మంత్రితో పాటు, కలెక్టర్, ఎమ్మెల్యేకు మా ఆవేదన తెలుపుతూ వచ్చాం. ఎమ్మెల్యేపై సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి పెంచారు. సీఎం కేసీఆర్ మా ఎమ్మెల్యే పలు మార్లు కలవడం, మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరడంతో కల నెరవేరింది.
– మహిపాల్, సర్పంచ్, మాలేగావ్.
దూరభారం తగ్గింది..
మేము కుభీర్కు రావాలంటే 22 కిలోమీటర్లు ప్రయాణించాలి. మండలం ఏర్పాటు చేయడంతో సమయంతోపాటు దూరభారం తగ్గింది. ఇప్పుడు ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే మా మండలానికి చేరుకుంటాం. ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు మా గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు.
– గుంచెటి లక్ష్మి, సర్పంచ్, నిగ్వ.