మంచిర్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 5.8 కోట్ల పరిహారం విడుదల చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టు కున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4,480 మంది రైతులకు చెందిన 5082.23 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయించిన రాష్ట్ర సర్కారు అధికారుల నివేదిక మేరకు గురువారం రూ.5.8 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు.