Fake Seeds | మరికొన్ని రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. జూన్ మొదటి వారంలో రైతులు కొత్త పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ క్రమం లో వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్నుకొని వారు పండించే పంట విత్తనాల కోసం ఎదురు చూస్తుంటారు. నిర్మల్ జిల్లాలో ప్రధానంగా వర్షాధారంతో పాటు సాగునీటి వనరు ల కింద వానకాలం సీజన్లో 4.50 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగవుతా యి. ఇందులో ప్రధానంగా పత్తి, మక్క, సోయా, పసుపు, ఇతర ఆహార, వాణిజ్య పం టలు సాగు చేస్తుంటారు. దీంతో వాటికి సరిపడా విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచనున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పత్తి పంటపైనే ప్రత్యేక దృష్టిపెట్టిన సర్కారు.. నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది.
జూన్ మొదటి వారమే విత్తనాలు విత్తుకునే సమయం కావడంతో రైతులు వారం రోజుల ముందుగానే అవసరమైన విత్తనాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. దీంతో నకిలీ విత్తనాల బారిన పడకుండా సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. నకిలీ విత్తనాలు తీసుకొని రైతులు మోసపోకుండా జిల్లాస్థాయిలో టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసింది. ఈ టీంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారితో పాటు తె లంగాణ విత్తన సీడ్ అధికారి, ఎస్బీకి సంబంధించిన పోలీసు అధికారి, ఇద్దరు ఏవోలు ఉంటారు. వీరితో కమిటీ ఏర్పాటు చేసి.. నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టనున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిం ది. ఈ క్రమంలో కల్తీ విత్తనాల నిరోధంపై జి ల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
నిరంతర తనిఖీలతోనే చెక్..
నిర్మల్ జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పత్తి పంటలోనే చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నేళ్లుగా అక్కడక్కడా కల్తీ పత్తి విత్తనాల బ్యాగులు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తున్న ది. వాటిని నిరోధించేందుకు తనిఖీలు చే పట్టనున్నారు. జిల్లా లో మొత్తం 581 మంది విత్తన డీలర్లున్నారు. వీరి దుకాణాల్లో వివిధ కంపెనీలకు సంబంధించిన విత్తనాలు అమ్ముతుంటారు. కాగా, టాస్క్ఫోర్స్ టీం సభ్యులు ఆ విత్తనాల నమూనాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బ్యాగుపై విత్తన రకం, ట్రూత్ఫుల్, సర్టిఫైడ్, కంపెనీ లాట్ నంబర్, అడ్రస్ తదితర పూర్తి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. పైగా ఆన్లైన్లో విత్తన డీలర్లు స్టాక్ వివరాలు పొందుపర్చి వ్యవసాయశాఖ అధికారుల లాగిన్లోకి రోజువారీగా క్రయవిక్రయాల వివరాలు పం పేలా చర్యలు తీసుకుంటున్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించకుండా స్టాక్ వివరాలపై రోజువారీగా తనిఖీలు చేపడుతారు. ప్రభుత్వం బీటీ 3 విత్తనాలను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ విత్తనాలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ము ఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే నకిలీ విత్తనాలు జిల్లాలోకి వచ్చే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాలపై నిఘా ఉంచారు. జిల్లాలోని బిద్రెల్లి, బెల్తరోడా, సిర్పెల్లి వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుశాఖ సమన్వయంతో నకిలీ విత్తనాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ధరలపై ప్రత్యేక నియంత్రణ..
మార్కెట్లో బీటీ పత్తి ధరలపై కూడా ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకవేళ నకిలీ విత్తనాలు పట్టుబడితే సంబంధిత డీలర్ లైసె న్స్ రద్దు చేయడమేకాకుండా పీడీ చట్టం అమ లు చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే జిల్లలోని నిర్మల్, ఖానాపూర్, ముథోల్, భైంసా తదితర ప్రాంతాల్లో విత్తన డీలర్లతో వ్యవసాయశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాలపై పూర్తి అవగాహన కల్పించారు. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.