పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉపాధ్యాయ నియామక ప్రకటన-2023 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎస్జీటీలను భర్తీ చేయనున్నది. ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనుండగా, అక్టోబర్ 21న తుది గడువుగా పేర్కొంది. నోటిఫికేషన్ విడుదలవడంతో ఇటు నిరుద్యోగులు, అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
– ఆదిలాబాద్, సెప్టెంబర్ 8 ( నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, సెప్టెంబరు 8 ( నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా విద్యారంగం అస్తవ్యస్తంగా ఉండేది. ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వసతులు, తరగతి గదుల కొరత, ఇతర సమస్యల కారణంగా పేద విద్యార్థుల చదువులు ముందుకు సాగేవి కావు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సర్కారు విద్యను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను మొదలు పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, డ్రెస్లు ఇతర వస్తువులను అందిస్తున్నది. వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను కూడా భర్తీ చేస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా ఇంటర్, డిగ్రీ తరగతులు ప్రవేశ పెట్టింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా సర్కారు స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఇక్కడి విద్యార్థులు వివిధ పరీక్షల్లో ప్రతిభ చూపుతూ దేశంలోని ఉత్తమ విద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తున్నారు.
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ నియామకం కోసం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 275 ఖాళీలు ఉన్నాయి. 54 స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలు ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో 9, స్థానిక సంస్థల పాఠశాలల్లో 46 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిత్ 13 ఖాళీలు ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో 6, స్థానిక సంస్థల పాఠశాలల్లో 7 ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులు 2 ప్రభుత్వం పాఠశాలల్లో ఉన్నాయి. సెంకడరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు 206 ఖాళీ ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో 36, స్థానిక సంస్థల స్కూళ్లలో 170 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా కమిటీల ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొలువులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు పలు పోస్టులు భర్తీ కానుండడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేను కొంతకాలంగా డీఎస్సీకి ప్రిపేరవుతున్న. పరీక్ష ఎప్పుడు పెడుతారోనని ఎదురు చూస్తున్న ఇన్నాళ్లకు ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష పేపర్ లీక్ కాకుండా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించడం బా గుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు వయోపరిమితి పెంచారు. బీఎడ్ చేసిన విద్యార్థులకు ఎన్సీటీఈ ప్రకారం ఎస్జీటీ పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుండే.
-పూసం మారుతి, అభ్యర్థి, సిరికొండ
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కల సాకారం చేస్తున్నది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చేసింది. 2020లో నేను డీఎడ్ పూర్తి చేశా. నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న. ఇప్పడు నోటిఫికేషన్ వచ్చేసింది. టీఆర్టీ కోసం కొంత కాలంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కావాల్సిన మెటీరియల్ సమకూర్చుకున్న. రాత్రింబవళ్లు 12 గంటల పాటు టీఆర్టీ కోసం కష్టపడుతూ చదువుతున్న. నా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలనుకుంటున్న.
– లక్కం సాయి డీఎడ్ అభ్యర్థి, బజార్హత్నూర్