మంచిర్యాల, జూన్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోడు భూములు సాగు చేసుకునే గిరిజన, ఆదివాసీ రైతుల గోడు తీరే రోజులు వచ్చాయి. పోడు పట్టాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరబోతున్నాయి. పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించడానికి చర్యలు చేపట్టిన రాష్ట్ర సర్కారు.. నేడు(శుక్రవారం) సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ మొదలుపెట్టనుంది. పోడు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్న అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా సర్వే చేశారు. ఈ మేరకు మొదటి విడుతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 31,026 మంది రైతులకు 85,398 ఎకరాలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. దీంతో జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పట్టాలు లేక ప్రభుత్వం అమలు చేసే రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రాయితీలు పొందలేకపోయామని, పట్టాలు వస్తే అన్నింటికీ తాము అర్హులమవుతామని సంబురపడి పోతున్నారు. నేడు ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పంపిణీని ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
చట్ట ప్రకారం.. పకడ్బందీగా..
అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కులు కల్పించనున్నారు. పోడు భూములను ఎన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారనే ఆధారాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించారు. సర్వేలో ఏమైనా తప్పులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సర్వే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 2005 సంవత్సరం కంటే ముందు నుంచి సాగులో ఉన్న గిరిజన, ఆదివాసీ రైతుల ఆధారాలను పరిశీలించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా పట్టాలను జారీ చేయనున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం గిరిజనుల నుంచి 24 వేల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో అన్ని రకాలుగా అర్హులుగా ఉన్న 12,222 మందికి ప్రస్తుతం పట్టాలు ఇవ్వనున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 31,715 మంది రైతులు 1,18,068 ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో గిరిజన రైతుల 15,613, ఇతర రైతులు 16,102 మంది ఉన్నారు. గిరిజన రైతులు 11,753 మందికి ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేయనున్నారు. మంచిర్యాల జిల్లాలో 4,503 మంది గిరిజన రైతులు, 7,374 మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోగా గిరిజనుల్లో అన్ని రకాలుగా అర్హులుగా ఉన్న 3,821 మంది రైతులను ఎంపిక చేశారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి 5,204 మంది రైతులకు అతి త్వరలోనే పట్టాలు ఇవ్వనున్నారు.
ఇగ రంది ఉండదు
నాకున్న ఐదెకరాలను ఇది వరకు సార్లు సర్వే చేసిన్రు. ఇప్పటిదాకా పట్టా ఇయ్యలే. ఎన్నో ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం. సీఎం కేసీఆర్ సార్ న్యాయం చేస్తరని మొదటి నుంచి మాకు నమ్మకం. ఇప్పుడు పోడు భూములకు పట్టాలిస్తమని చెప్పిన్రు. పట్టా వస్తే రైతుబంధు డబ్బులు వస్తయ్. రైతు బీమా కూడా వర్తిస్తది. మా బాధలన్నీ పోతయ్. ఇగ మాకు రంది లేకుంటైతది.
– సిడాం ముత్త, కొలాం ఝరి
ఇగ ఫారెస్టోళ్లతో తిప్పలుండవు
మా ఊరిలో మాకింత ఎవుసం భూమి ఉంది. గదీని మీదనే ఆధారపడి బతుకుతున్నం. సర్కారోళ్లు పట్టాలిస్తే మా తిప్పలన్నీ తీరినట్లే. ఇంతకాలం ఫారెస్ట్ సార్లతో పడ్డ బాధలన్నీ పోతయి. రైతు బంధు, రైతుబీమా వస్తది. బ్యాంకుల్లో లోన్లు కూడా దొరుకుతయి. మాకు పట్టాలివ్వడానికి వస్తున్న సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– మడావి అన్నిబాయి, కొలాం ఝరి