తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకునేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా.. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు అంటే 21 రోజులపాటు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రగతి అడుగడుగునా ప్రతిబింబించేలా.. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమష్టిగా ముందుకెళ్తున్నారు. వ్యవసాయం, విద్యుత్తు, తాగు, సాగునీరు, పల్లె, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్య రంగం ఇలా ప్రతిరంగం విజయాలు తెలిపేలా ఉత్సవాలు ఉండనున్నాయి. జెండావిష్కరణతో వేడుకలు ఆరంభం అవుతుండగా.. అమరుల సంస్మరణతో ముగియనున్నాయి. కాగా.. ఒక్కో జిల్లాకు రూ.2.70 కోట్ల చొప్పున రూ.13.50 కోట్ల నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేసింది.
మంచిర్యాల, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెడుతున్నది. గడిచిన తొమ్మిదేండ్ల సొంత పాలనలో బీడువారిన భూములు పచ్చని పొలాలుగా మారగా.. నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్యమ నినాదాన్ని నిజం చేసుకుంది. దేశంలో ఎక్కడా లేనన్ని నిధులు అభివృద్ధి పనులకు కేటాయించుకొని, లక్షకు పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చి, దేశానికే ఆదర్శవంతమైన పాలనతో జూన్2న పదో పుట్టిన రోజుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజులపాటు రోజుకో కార్యక్రమాన్ని పండుగలా చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈ మేరకు ఒక్కో జిల్లా దశాబ్ది వేడుకల కోసం రూ.2.70 కోట్లు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాకు రూ.13.5 కోట్లు ఇప్పటికే మంజూరు కాగా.. అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు(శుక్రవారం) వేడుకల ప్రారంభానికి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. పదేళ్లలో జిల్లాలో జరిగిన ప్రగతిని ప్రజలకు నివేదించేలా చర్యలు తీసుకుంటున్నది. ఉత్సవాలు మూడు వారాలపాటు కొనసాగనున్నాయి.
జూన్2వ తేదీ వేడుకల ప్రారంభానికి కలెక్టరేట్లు ముస్తాబవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభు త్వ విప్ గంప గోవర్ధన్, మంచిర్యాలలో విప్ బాల్క సుమన్, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆసిఫాబాద్లో విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారు. కలెక్టర్లో పతాక వందనం చేయడంతో వే డుకలు మొదలుకానున్నాయి. జూన్3వ తేదీన తె లంగాణ రైతు దినోత్సవం, 4న సురక్షా దినోత్స వం, 5న విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురా లు, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సా గునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండు గ, 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న సు పరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్స వం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్స వం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న మంచి నీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20 న విద్యా దినోత్సవం, 21న తెలంగా ణ ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరుల సంస్మరణ కార్యక్రమాలు ఉంటాయి. ఆయా రంగాల్లో జరిగిన అభివృద్ధిని జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రజలకు వివరిస్తూ రోజు వారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలు జ రిగే సమయంలోనే జూన్ 4న నిర్మల్కు, 9న మంచిర్యాల జిల్లాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.