వానకాలం సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేయగా.. ఇందులో పత్తి 1.50 లక్షలు, వరి లక్ష, సోయా 90 వేలు, మక్క 25 వేలు, కందులు 30 వేలు.. మినుములు, పెసర్లు, ఇతర పంటలు కలిపి 15 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆయా డీలర్ల వద్ద 135 క్వింటాళ్ల పత్తి, 15 వేల క్వింటాళ్ల వరి, 25 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అందుబాటులో ఉండగా.. 46 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. కాగా.. మార్కెట్లో నకిలీ విత్తనాలు రాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టగా.. విత్తనాల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
– నిర్మల్, మే 28(నమస్తే తెలంగాణ)
నిర్మల్, మే 28(నమస్తే తెలంగాణ) : వానకాలం సాగుపై వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు కార్యాచరణ తయారు చేశారు. ఇందులో పత్తి 1.50 లక్షలు, వరి లక్ష, సోయా 90 వేలు, మక్క 25 వేలు, కందులు 30 వేలు.. మినుములు, పెసర్లు, ఇతర పంటలు కలిపి 15 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈసారి కూడా వరిని తగ్గించి, పత్తితోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయించేందుకు రైతులను అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఆయిల్ పామ్ను కూడా ప్రత్యామ్నాయ పంటగా వేయాలని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాదాపు ఏడు వేల ఎకరాల్లో సాగవుతుండగా.. ఆయా తోటల్లో అంతర పంటగా మక్క, కూరగాయలు పండిస్తున్నారు.
46 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు
వానకాలం సీజన్ ప్రారంభం అవుతుండడంతో ఎరువులు, విత్తనాలు ఎంత అవసరమో ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఆయా డీలర్ల వద్ద 135 క్వింటాళ్ల పత్తి, 15 వేల క్వింటాళ్ల వరి, 25 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈసారి 46 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయగా.. ప్రస్తుతం 24,500 అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా 13,500.. 8 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరముండగా 5,500.. 6 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరముండగా 4,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా ఎరువులను కూడా తెప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
నకిలీ విత్తనాలపై నిఘా
మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాకుండా అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. ఇప్పటికే విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ఉండేందుకు కలెక్టర్ పర్యవేక్షణలో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయగా, ఈ బృందంలో ఆ మండల పరిధిలోని ఎస్సై, వ్యవసాయ అధికారి ఉంటారు. అలాగే జిల్లా స్థాయిలో పోలీసు శాఖ నుంచి సీఐ, వ్యవసాయాధికారి, విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్తో కూడిన బృందం తనిఖీలను పర్యవేక్షిస్తారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో ప్రభుత్వ అనుమతితో విత్తనాలను విక్రయించేందుకు 450 విత్తన దుకాణాలు ఉన్నాయి. మరోవైపు రైతులకు నాణ్యమైన విత్తనాల కొరత లేకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
లాభదాయక పంటలు వేయాలి..
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ విధానంతోపాటు, క్యూఆర్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోకుండా అధికారులను సంప్రదించాలి. పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నిర్మల్