ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన విశ్వరూపాన్ని చూపుతున్నాడు. మధ్నాహ్నం వరకు జిల్లాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఎండకు భయపడి జనం బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం ఆరు గంటలైనా వేడి తగ్గడం లేదు. బుధవారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్లో 44.6, గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 44.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఏప్రిల్లోనే ఎండలు ఇలా ఉంటే.. మేలో ఎలా ఉంటాయోనని ప్రజలు జంకుతున్నారు. ఎండవేడిని తాళలేక జనం కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వడదెబ్బకు గురై ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
– మంచిర్యాల, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన ఐదారు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటే వేడి సెగలు పుట్టిస్తున్నది. దీంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 11.30 గంటలు దాటిందంటే రహదారులపై జన సంచారం తగ్గిపోతున్నది. నేటి నుంచి నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అన్ని జిల్లాల్లో గురువారం సగటున 38 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాలలో 41 డిగ్రీలు, నిర్మల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 44.2, ఆదిలాబాద్ జిల్లా భోరజ్లో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగత్రలు రికార్డు అయ్యాయి. రేపు, ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్లో అత్యధికంగా 44.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 44.3, చాప్రాలా 43.8, అర్లి-టీ (ఆదిలాబాద్) 43.1, కొమ్మెర (మంచిర్యాల) 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇప్పుడే ఇలా.. మే నెలలో ఎలా..
ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోవడంతో జనం జంకుతున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడిపోతున్నారు. ఎండకు బయటికి వెళ్లలేక, ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సూర్యుడి తాపానికి తాళలేక ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతున్నారు. ఈ మేరకు ఏసీలు, కూలర్లు రిపేరింగ్ చేసే వారికి డిమాండ్ పెరిగింది. మరోవైపు కొత్త ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగినట్లు ఆయా షాపుల యాజమానులు చెబుతున్నారు. ఏదేమైనా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని వైద్యనిపుణులు చెబుతున్నారు. బీపీ, షుగర్ లాంటి వ్యాధులున్న వారు డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. స్కూళ్లకు వెళ్లే పిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.