నిరుపేదలకు మెరుగైన వైద్యమందించే లక్ష్యంతో ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, మరికొద్ది రోజుల్లో టెలీ మెడిసిన్ (ఈ-సంజీవని) సేవలకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇప్పటి వరకు కేవలం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మాత్రమే సేవలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం జిల్లాలోని 149 సబ్ సెంటర్లకూ విస్తరిస్తున్నది. ఏరియా దవాఖానలో రోజుకో స్పెషలిస్టు వైద్యుడిని నియమించనుండగా, 24 గంటల పాటు ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు కల్పిస్తున్నది.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/ మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 2 : జిల్లాలో త్వరలో టెలీ మెడిసిన్ ద్వారా ఆరోగ్య సేవలు (ఈ- సంజీవని) అందనున్నాయి. ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇది వరకు (ఆరు నెలలుగా) కేవలం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మాత్రమే ఈ టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం జిల్లాలోని 149 సబ్ సెంటర్లలో 24 గంటలు టెలీ మెడిసిన్ రూపంలో ఆరోగ్య సేవలు అందనున్నాయి. ఈ టెలీ మెడిసిన్ (ఈ సంజీవని) ద్వారా డిజిటల్ విధానంలో ఆరోగ్య సమస్యలకు సత్వర పరిష్కారం లభించనున్నది. అంతేగాకుండా దవాఖానలలో అందిస్తున్న సేవలు, వాటిని పొందడంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చు.
149 సబ్ సెంటర్లకు ట్యాబ్లు
జిల్లాలోని మూడు సీహెచ్సీలు, నాలుగు యూపీహెచ్సీలు, 17 పీహె చ్సీల పరిధిలో 149 సబ్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి సబ్ సెంటర్కు ఒక ట్యాబ్ చొప్పున 149 ట్యాబ్లను సిబ్బందికి ప్రభుత్వం అందజే సింది. జిల్లాలో 663 మంది ఆశ కార్యకర్తలు, 252 మంది ఏఎన్ఎం లు పని చేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఇది వరకే మొబైల్లు, సిమ్ కార్డులు అందజేసింది. క్షేత్ర స్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న సమ స్యలు పరిష్కరించుకునేందుకు ఆశ కార్యకర్తల ద్వారా ఏఎన్ఎంకు, పీహెచ్సీల వైద్యులకు ఫోన్ చేయవచ్చు. సరైన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అంతేగాకుండా స్పెషలిస్టు వైద్యులతోనూ మాట్లాడి పరిష్కారం పొందవచ్చు. ఈ విషయాలన్నీ సబ్ సెంటర్లలో ట్యాబ్ల ద్వారా సమాచారం సైతం జిల్లా కేంద్రానికి చేరుతుంది.
వారంలో ఆరు రోజులు వైద్యనిపుణుల సలహాలు
తెలంగాణ ప్రభుత్వం టెలీ మెడిసిన్ సేవలందించేందుకు వారంలో ఆరు రోజులు రోజుకో ఒక స్పెషలిస్టు వైద్యుడిని జిల్లా ఏరియా దవాఖానలో అందుబాటులో ఉంచనున్నది. సోమవారం గైనకాలజీ, డెర్మటాలజీ సమస్యలపై సంబంధిత స్పెషలిస్టు వైద్యులు సేవలందిం చనున్నారు. మంగళవారం ఈఎన్టీ, ఆఫ్తమాలజీ, బుధవారం జనర ల్ మెడిసిన్, గురువారం పీడియాట్రిక్, జనరల్ సర్జన్, శుక్రవారం గైన కాలజీ, శనివారం ఆర్థోపెడిక్ సమస్యలపై స్పెషలిస్టు వైద్యులు టెలీ మెడిసిన్ ద్వారా సేవలందించనున్నారు. వీరు మధ్యాహ్నం 12 గంట ల నుంచి 2గంటల వరకు సలహాలు, సూచనలు చేయనున్నారు.
24 గంటలు అందుబాటులో సిబ్బంది
ప్రభుత్వం 24 గంటల పాటు వైద్య సేవలు అందజేయడం కోసం మరో పక్షం రోజుల్లో ఈ-సంజీవని (టెలీ మెడిసిన్ ద్వారా ఆరోగ్య సేవలు) కార్యక్రమాన్ని అమలు చేయనున్నది. దీనిపై ఇది వరకే వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం. రోగుల ఆరోగ్య సమస్యలు ఎలా నమోదు చేయాలో, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ఆరోగ్య సేవలు ఎలా అందించాలో, రోగులు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం, దవాఖానలో చేర్చకుండానే అత్యవసర చికిత్సలు, నిపుణుల సూచనలు, సలహాలు ఎలా తీసుకోవాలో వివరించాం. ముఖ్యంగా దీనిని జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల