సీసీసీ నస్పూర్/నస్పూర్, సెప్టెంబర్ 17: తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని, ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్లోని కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదట పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ విశిష్టతను వివరించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో తెలంగాణ ప్రాంతంపై చూపిన వివక్షతపై మండిపడ్డారు.
ఉద్యమనేత కేసీఆర్తోనే బంగారు తెలంగాణ
కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. బంగారు తెలంగాణగా మార్చుతున్నారని విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా కొనసాగుతుందని వివరించారు. అనతికాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. వలసల జిల్లాగా పేరుపోయిన పాలమూరుకు.. నేడు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించడంతో 14 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు లేకుండా చేశారని, ప్రశాంతంగా పాలన కొనసాగుతుండడంతో పరిశ్రమలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు చేరవేస్తున్న సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే ఆత్మబలిదానాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రకటనపై కేంద్రంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని బాల్క సుమన్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తే.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఆయన అడుగులకు మడుగులొత్తారని మండిపడ్డారు. చావునోట్లో తలపెట్టి కేసీఆర్ చేసిన ఆమరణదీక్షతో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి యూటర్న్ తీసుకోవడం వల్లే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా అనేక కుట్రలు జరిగాయని, కమిటీలతో కాలయాపన చేసిన ప్రజల ఆకాంక్షను విస్మరించిన కాంగ్రెస్ను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కడుతున్నామని ప్రకటించి, లక్షలాది రూపాయల నిధులు విడుదల చేసి అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోందని, ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని, ప్రజలు . నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. రైతులకు 3 గంటల విద్యుత్, ధరిణిని తొలగించే కుట్రలు చేసి, రైతులను దగా చేయాలని చూస్తుందన్నారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను అడ్డుకోలేక అనేక కుట్రలు చేస్తున్నారని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు అవుతున్నా ఇంత వరకు కృష్టా జలాల వాటాను తేల్చకుండా నాన్చుతున్నదని తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకులు న్యాయంగా రావాల్సిన హక్కులపై కేంద్రంతో మాట్లాడి తెప్పించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి చేస్తే.. సీఎం కేసీఆర్ అస్సలు ఒప్పుకోలేదని గుర్తు చేశారు. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకున్నా.. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిందని తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వలేదని, ఇలా అనేక రకాలుగా కేంద్రం తెలంగాణపై వివక్ష చూపినా.. సీఎం కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులకు నోట్బుక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, డీసీపీ రాంనాథ్ సుధీర్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్లు ఈసంపల్లి ప్రభాకర్, పెంట రాజయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.