ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు చేపట్టే విధానానికి ముగింపు పలికింది. లైసెన్సు కలిగిన డీలర్లు మాత్రమే ఇక నుంచి విత్తనాలు, ఎరువులు విక్రయించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను రూపొందించింది. దీనిద్వారా విత్తనాలు, ఎరువుల కొరతకు చెక్ పడనుండగా, నకిలీల బెడద తప్పనుంది. మరోవైపు నకిలీ విత్తనాల రవాణాపై పోలీస్ శాఖ సీరియస్గా దృష్టిపెట్టింది. అక్రమార్కులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది.
నిర్మల్, మే 6(నమస్తే తెలంగాణ): నకిలీ ఎరువులు, విత్తనాలు అన్నదాతను ఏటా ముంచుతున్నాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నకిలీలకు అడ్డుకట పడడం లేదు. దీన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను నిలువరించేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇది సమర్థవంతంగా అమలైతే రైతులకు నకిలీ విత్తనాల బెడద తప్పుతుంది. ఈ వానకాలం సీజన్ నుంచే కొత్త విధానం అమలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో డీలర్లతో వ్యవసాయాధికారులు సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. కాగా, జిల్లా సీడ్ లైసెన్స్ ద్వారా రిజిస్టర్ అయిన డీలర్లు ఇకపై ఈ సైట్ ద్వారా మాత్రమే క్రయవిక్రయాలు జరుపాల్సి ఉంటుంది. ప్రైవేట్ విత్తన డీలర్లు కూడా ఈ సైట్ ద్వారానే విక్రయించాలి. ఆయా జిల్లాల్లో విత్తన డీలర్లకు ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందించింది. ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోగా సదరు డీలర్ తాను కొనుగోలు చేసిన ఆయా కంపెనీల విత్తనాల వివరాలు, అమ్మకం, స్టాక్ వివరాలను ఈ సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
మరికొద్ది రోజుల్లో విత్తనాల విక్రయాలు ముమ్మరం కానుండడంతో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. నిర్మల్ జిల్లాలో గతేడాది పలు మండలాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పెద్ద సంఖ్యలో రైతులు మోసపోయారు. మొక్క ఏపుగా పెరిగినప్పటికీ పూత, కాత లేకపోవడంతో బాధిత రైతులు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి, వాటిని విక్రయించిన 8 మందిపై సీడ్ యాక్ట్ 1966 ప్రకారం ఐపీసీ 420 కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి సంఘటనలు తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతుండడంతో దీనిని అరికట్టేందుకు నిఘాను ముమ్మరం చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతుకూ విత్తన, ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్, మార్క్ఫెడ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సొసైటీలకు విత్తనాలను పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
కృత్రిమ కొరతకు అడ్డుకట్ట…
ప్రతిసారీ సీజన్ ప్రారంభం కాగానే కొందరు విత్తన డీలర్లు మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వెబ్సైట్ ద్వారా కృత్రిమ కొరతకు అడ్డుకట్ట పడనుంది. ఒకవైపు రోజువారీ క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను రికార్డులో నమోదు చేయడంతోపాటు ప్రతీ నెలా విధిగా విత్తన డీలర్లు ప్రత్యేకంగా రూపొందించిన సైట్లో అన్ని వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అధికారులు ఆకస్మిక తనిఖీలకు వచ్చినప్పుడు సదరు డీలర్ దగ్గర ఆన్లైన్లో పొందుపర్చిన విధంగానే స్టాక్ ఉండాలి. లేకుంటే సదరు డీలరుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే నకిలీ విత్తనాలకు సైతం ఈ విధానంతో పూర్తిగా చెక్ పడనుంది. కేవలం ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీల వివరాలను మాత్రమే ఈ వెబ్సైట్ తీసుకుంటుంది. అనుమతి లేని విత్తన కంపెనీల వివరాలను పొందుపర్చడానికి వీలుండదు. దీంతో సదరు విత్తన వ్యాపారి గోడౌన్లో, దుకాణాల్లో ఆన్లైన్లో నమోదు చేసిన విత్తనాలను కాకుండా వేరే విత్తనాలను పెట్టడానికి వీలు లేదు. ఒక వేళ తనిఖీల సమయంలో అవి లభ్యమైతే డీలర్ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అందించడం, కృత్రిమ కొరతకు తావులేకుండా చూడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలను చేపట్టింది. కాగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులు… వారి పరిధిలోని విత్తన డీలర్లకు వెబ్సైట్ నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.
‘నాసిరకం’పైనా నజర్
వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో నకిలీ విత్తనాల విక్రయదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మంచిర్యాల జిల్లాలో పత్తి సాగువిస్తీర్ణం పెరుగుతుండడాన్ని అక్రమార్కులు ఆసరాగా తీసుకుంటుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నకిలీ విత్తనాలను తెస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, తదితర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2021లో 65 కేసులు నమోదు కాగా, 157 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది. రూ.23.25 లక్షల విలువైన 1,193 కిలోల నకలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నకిలీ విత్తనాల సరఫరాలో గత నెల 20 వరకు మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. 28 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వారి నుంచి 58.60 లక్షల రూపాయల 3,020 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
విత్తనాల కొరత ఉండదు…
ప్రభుత్వం ఆమోదించిన కంపెనీల విత్తనాలు మాత్రమే డీలర్లు విక్రయించేందుకు ఈ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. డీలర్ ప్రతినెలా ఈ సైట్లో అన్ని రకాల వివరాలను నమోదు చేయాలి. నిర్ధిష్ట సమయంలో వివరాలు నమోదు చేయాలనే అంశాలపై ఇప్పటికే వారికి అవగాహన కల్పించాం. విత్తనాల కృత్రిమ కొరతకు ఇకపై చెక్ పడనుంది. మండల, డివిజన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లాకు వచ్చిన విత్తనాలు ఎన్ని… రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు ఎన్ని… మొదలైన వివరాలను పరిశీలించడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే రైతుల డిమాండ్ మేరకు విత్తనాల కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడానికి కూడా ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
-అంజిప్రసాద్, డీఏవో, నిర్మల్
పీడీ యాక్టు నమోదు చేస్తాం..
ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ పత్తి విత్తనాలు, గైసిల్ గడ్డి మందు విక్రయాలు జరిపినా, సరుకు అక్రమంగా రవాణా చేసినా వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. ప్రభుత్వ నిబంధనలు, సూచనల ప్రకారం డీలర్లు విక్రయాలు కొనసాగించాలి. నకిలీ విత్తనాలు విక్రయించే వారి సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు తెలుపాలి. విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాం.
– చంద్రశేఖర్ రెడ్డి, సీపీ, రామగుండం