ఆదిలాబాద్ యువతీయువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కల సాకారమైంది. సొంతగడ్డపైనే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్న స్వప్నం నెరవేరింది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకే పరిమితమైన సాఫ్ట్వేర్ కొలువులు మన దరిచేరాయి. ఉన్న ఊరును, కన్నవాళ్లను వదిలి ఎక్కడికో వెళ్లకుండా ఉన్న చోటనే కొలువు చేసుకునే అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీటీ డాట్ కంపెనీని ఏర్పాటు చేసింది. మొదటి విడుతగా 50 మంది ఐటీ ఇంజినీర్లను ఎంపిక చేసింది. శనివారం ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, కంపెనీ ప్రతినిధులు నియామకపత్రాలు అందజేశారు. తమ ప్రాంత బిడ్డలు తమ కండ్ల ముందే ఐటీ కొలువులు చేయనుండగా.. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రామన్నకు ధన్యవాదాలు తెలిపారు.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నది. తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిసారించి పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నది. నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కంపెనీని ఆదిలాబాద్లో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఎన్టీటీ డాటా కంపెనీని జిల్లా కేంద్రానికి వచ్చేలా ప్రోత్సాహకాలు అందజేసింది. ఇటీవల హైదరాబాద్లో కంపెనీ ప్రతినిధి సంజీవ్ దేశ్పాండే ఎమ్మెల్యే జోగు రామన్నతోపాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి కంపెనీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు మంత్రి సంజీవ్ దేశ్పాండేను అభినందించారు. కంపెనీ ఏర్పాటు జిల్లా ప్రజలకు సంతోషకరమైన వార్త అని ట్విట్టర్లో మంత్రి పేర్కొన్నారు.
కంపెనీని ప్రారంభించడానికి చర్యలు తీసుకున్న ప్రతినిధులు, ఉద్యోగులు ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్లో మూడు రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కంపెనీ ఇంటర్వ్యూలకు హాజరు కాగా వారిలో 50 మందిని ఎంపిక చేశారు. ఐటీ ఇంజినీర్లుగా ఉద్యోగాలు వచ్చిన వారికి శనివారం ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ ఉదయ్కుమారెడ్డి. ఎన్టీటీ డాటా సీఈవో సంజీవ్ దేశ్పాండే నియామక పత్రాలు అందజేశారు. త్వరలో మరో 300 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ ప్రతినిధులు తెలిపారు. ఉన్న చోట ఉద్యోగం లభించడంపై నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నది.
నా పేరు ఆవుల మాధురి. నేను బీటెక్ పూర్తి చేశా. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా. మంత్రి కేటీఆర్ సహకారంతో మా ఆదిలాబాద్ జిల్లాకే ఐటీ ప్రతినిధులు వచ్చి నన్ను సెలెక్ట్ చేశారు. ఇక్కడే ఆరు నెలలు శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఈ రోజే ఎమ్మెల్యే నియామక పత్రం కూడా అందించారు. ఉన్న ఊర్లోనే ఉద్యోగం కల్పించిన తెలంగాణ సర్కారురు రుణపడి ఉంటం.
ఆదిలాబాద్కు ఐటీ కంపెనీ రావడం చాలా గొప్ప విషయమని ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి అన్నారు. కంపెనీ సీఈవో ఐటీ కంపెనీ ఏర్పాటు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఉద్యోగాలు పొందిన యువత శిక్షణ కాలంలో అన్ని విషయాలు నేర్చుకొని ప్రతిభ కనపర్చాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువకులకు రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. – ఉదయ్కుమార్ రెడ్డి, ఎస్పీ, ఆదిలాబాద్
రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తూ ఎన్నో కంపెనీలను రాష్ర్టానికి తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సార్కు ధన్యవాదాలు. ప్రభుత్వం ఐటీ కంపెనీలను ప్రోత్సహించి హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్లో ఏర్పాటు చేయడం నిరుద్యోగుల కోసం సర్కారు చేస్తున్న గొప్ప కృషిగా చెప్పవచ్చు. హైదరాబాద్లో చదువుకున్న నాకు ఉన్న సొంత ఊరు ఆదిలాబాద్లో ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
– హరిదాస్ విపుల్, ఐటీ ఉద్యోగి, ఆదిలాబాద్
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్లో ఐటీ కంపెనీని ఏర్పాటు చేశారని ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంత్రి కేటీఆర్కు జిల్లాపై అభిమానం ఉందని టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండే ఐటీ కంపెనీ ఆదిలాబాద్కు రావడం యువతకు వరం వంటిదన్నారు. పట్టణ ప్రాంతాల యువకులకు వచ్చే ఐటీ ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు లభిస్తాయని తెలిపారు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన ఎన్టీటీ డాటా కంపెనీకి ప్రభుత్వం అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
ఆదిలాబాద్ ఐటీ కంపెనీలో ప్రస్తుతం 50 మందిని ఎంపిక చేసుకున్నం. వివిధ విభాగాల్లో త్వరలో మరికొంత మందిని నియమించుకుంటాం. ఐటీ కంపెనీలో ఎంపిక చేసిన వారికి మెరుగైన శిక్షణ అందిస్తాం. ఐటీలో నైపుణ్యతను పెంపొందించడమే కాకుండా సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతర విభాగాల్లో శిక్షణ ఇచ్చి వారి ప్రతిభను వెలికితీస్తాం. ఆదిలాబాద్లో తమ కంపెనీని ప్రారంభించడానికి సహాయ, సహకారాలు అందించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్నకు ధన్యవాదాలు.
– సంజీవ్ దేశ్పాండే, ఎన్టీటీ సీఈవో
నేను హైదరాబాద్లో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ప్రస్తుతం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా. ఈ సమయంలో ఆదిలాబాద్లో ఐటీ కంపెనీ ఏర్పాటు కావడం, అందులో నాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో నేను ఎంపిక అయ్యా. తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్లో ఐటీ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో నాలాంటి వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. – సాయి ప్రియ, ఐటీ ఉద్యోగి. ఆదిలాబాద్.
హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసిన నేను అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆదిలాబాద్కు ఐటీ కంపెనీ వచ్చిందని తెలిసింది. కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యా. ప్రతిభ ఆధారంగా నన్ను ఎంపిక చేశారు. హైదరాబాద్తోపాటు ఇతర నగరాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం వస్తుందని అనుకున్న నాకు ఉన్న ఊర్లోనే జాబ్ రావడం ఊహించలేకపోతున్నా.
– ప్రత్యూష షల్లా, ఐటీ ఉద్యోగి, ఆదిలాబాద్