యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుండగా.. 185 కేంద్రాలు అవసరమని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఐకేపీ 32, పీఏసీఎస్ 82, డీసీఎంఎస్ 66, జీసీసీ ఆధ్వర్యంలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,00,846 ఎకరాల్లో వరి సాగవుతుండగా.. ఎకరాకు సగటున 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. 42 లక్షల గన్నీ బ్యాగులు అవసరమవుతుండగా.. 21 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయి. కాగా.. గ్రేడ్-ఏ రకానికి క్వింటాలుకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర చెల్లించనున్నది.
నిర్మల్, మార్చి 29(నమస్తే తెలంగాణ): గత యాసంగిలో వడ్లను కొనబోమని కేంద్రం మొండికేసినా… అన్నదాతకు తామే అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఎక్కడికక్కడ వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మా రైతులను మేమే కాపాడుకుంటామని యాసంగిలో పండిన వడ్లను కనీస మద్దతు ధర తో కొనుగోలు చేసింది.
ఈ యేడు కూడా యాసం గి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతున్నది. వచ్చే నెల మొదటి వారంలో కొన్ని చోట్ల వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధాన్యం సేకరణకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి అన్నదాతకు అన్ని విధాలుగా అం డగా నిలుస్తూ కొండంత భరోసానిస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు తోరైతులు ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకున్నా… ఆర్థికంగా భారమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది.
ఈ యాసంగిలో కూడా రైతులు పండించిన ప్రతీ గింజను కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నిర్మల్ జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వచ్చే నెల మొదటి వారంలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 15నుంచి అవసరమైన చోట కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ యాసంగిలో ధాన్యం సేకరణకు కోసం జిల్లా వ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
యాసంగిలో జిల్లా వ్యాప్తంగా రైతులు 1,00,846 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఎకరానికి సగటున 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ విధంగా మొత్తం 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాలఅధికారులు చెబుతున్నారు. ఇందు లో స్థానిక అవసరాలు, సీడ్ కోసం 10 వేల మెట్రిక్ టన్నులు పోగా, మిగతా 1.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 185 కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ కొనుగోళ్లను చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు.
జిల్లాలో 185 కేంద్రాల ఏర్పాటు…
నిర్మల్ జిల్లాలో మొత్తం 185 వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, వీటిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సెంటర్లు 32, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 82, డీసీఎంస్ ఆధ్వర్యంలో 66, జీసీసీ ఆధ్వర్యంలో 5 కేంద్రాలు ఉన్నాయి. కాగా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటికే కొనుగోలు సెంటర్ల ఏజెన్సీలకు 130 ప్యాడీ క్లీనర్లను అందజేశారు. అదనంగా మరో 95 ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అకాల వర్షాల నుంచి అన్నదాతను కాపాడేందుకు గత రెండు సీజన్లలో 2500ల టార్పాలిన్లను రైతులకు పంపిణీ చేశారు.
ఇంకా మార్కెట్ కమిటీల్లో 1850 వరకు టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ధాన్యం తూకం వేసేందుకు 304 ఎలక్ట్రానిక్ కాంటాలను ఇప్పటికే పంపిణీ చేశారు. మరో 125 కాంటాలు అదనంగా అందుబాటులో ఉంచారు. తేమ శాతాన్ని గుర్తించేందుకు 250 మీటర్లను పంపిణీ చేయగా, మరో 40 మీటర్లను అందుబాటులో ఉంచామని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. ముఖ్యం గా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తాగునీరు, నీడ సౌకర్యం కల్పించనున్నారు.
గోనె సంచులు సిద్ధం…
యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 42 లక్షల గోనె సంచులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 21లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయి. మిగతా గోనె సంచులను వివిధ రూపాల్లో సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు మిల్లర్ల నుంచి సంచులను తెప్పించుకున్న పౌరసరఫరాల శాఖ అధికారులు… రేషన్ షాపుల్లోని బ్యాగులు సేకరించే పనిలో పడ్డారు. రేషన్ దుకాణాల్లోని ఒక్కో సంచికి రూ.21 వెచ్చించనున్నారు. గోనె సంచుల సేకరణ పూర్తి కాగానే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వచ్చే నెల మొదటి వారంలో శిక్షణ ఇచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
కాగా గత వానకాలం సీజన్ నుంచి ప్రభుత్వం వరి మద్దతు ధరను రూ.100 పెంచిన సంగతి తెలిసిందే. గ్రేడ్-ఏ రకం క్వింటాలుకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర అందిస్తున్నది. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించనున్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
1.70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం
జిల్లాలో ఈ యాసంగి సీజన్కు గాను 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించాం. మొత్తం 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ప్రతి కేంద్రంలో సరిపడా గోనె సంచులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పిస్తాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 24గంటల్లోపు వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రాల నుంచి వెంటనే మిల్లులకు ధాన్యాన్ని తరలించేలా ఏర్పాట్లు చేశాం.
కే.శ్రీకళ, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ