మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం పురిటి గడ్డ ఆసిఫాబాద్ జిల్లా నుంచే శుక్రవారం సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలు ప్రారంభించడానికి వచ్చిన ఆయన 11 మంది గిరిజన రైతులకు స్వయంగా పట్టాలు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 31,026 మంది గిరిజన రైతులకు 99,019 ఎకరాలు పంపిణీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.99 కోట్ల రైతుబంధు సాయం అందించనున్నారు. వానకాలం పెట్టుబడి సాయానికి సంబంధించి రూ.23.26 కోట్లను ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావ్కు సీఎం కేసీఆర్ అందజేశారు. దశాబ్దాల కల నెరవేరడంపై అడవిబిడ్డలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోడు రైతుల కల నెరవేరింది. దశాబ్దాల కాలంగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనుల నిరీక్షణకు తెరపడింది. స్వయంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శుక్రవారం గిరిజన రైతుకు పోడు పట్టా అందింది. గిరిజన వీరుడు క్రుమం భీం పురిటి గడ్డ ఆసిఫాబాద్ జిల్లా ఈ కార్యక్రమ ప్రారంభానికి వేదికైంది. ఇక్కడి నుంచి రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీని ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, ఈ సీజన్ నుంచే పట్టాలు తీసుకున్న వారికి రైతుబంధు సాయం వర్తించనుండడంతో గిరిజన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31,026 మంది రైతులుండగా, 99,019 ఎకరాలకు యేటా ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.99.01 కోట్ల సాయం అందనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 12,222 రైతులకు 34 వేల ఎకరాలకు పట్టాలు అందజేయనున్నారు. అందుకు రూ.34 కోట్లు రైతు బంధు అందనున్నది. మంచిర్యాల జిల్లాలో 1847 మంది రైతులకు గాను 3821 ఎకరాలకు పట్టాలు అందనుండగా, రూ.3.82 కోట్లు.., నిర్మల్ జిల్లాలో 5,204 రైతులకు 14,068 ఎకరాలకు పట్టాలు అందనుండగా, రూ.14 కోట్లు.., కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 11,753 మంది రైతులకు గాను 47,130 ఎకరాలకు పట్టాలు అందనుండగా, రూ.47.1 కోట్ల రైతుబంధు సాయం అందనున్నది. కాగా, ఆసిఫాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఈ సీజన్కు సంబంధించిన రైతు బంధు సాయం రూ.23.56 కోట్లను కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుకు అందజేశారు. కాగా, ఇన్నాళ్లు అప్పు తెచ్చి చిక్కుల మధ్య వ్యవసాయం చేసిన తాము ఇకపై పైసా అప్పు లేకుండా రైతు బంధు సాయంతో సాగు చేసుకుంటామని పోడు రైతులు సంబురపడుతున్నారు.
సీఎం చేతుల మీదుగా పట్టా..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎంపిక చేసిన 11 మంది రైతులకు సీఎం తన చేతుల మీదు పట్టాలను అందించారు. కాగజ్నగర్ మండలం గోంది గ్రామానికి చెందిన మడావి కాలుబాయి, మడావి లక్ష్మి, దుర్గాం గ్రామానికి చెందిన ఆత్రం భీంబాయి, మాలిని గ్రామానికి చెందిన సుర్పం అనసూయ, సునిత, తిర్యాణి మండలం చిన్నక్కపల్లికి చెందిన ఎదుల ఎల్లక్క, జైనూర్ మండలం పట్నాపూర్కు చెందిన వనిత, వాంకిడి మండలం పాటగూడకు చెందిన కాత్లె భాగ్యలక్ష్మి, ఆసిఫాబాద్ మండలంలోని కర్పెత విమలా బాయి, సిర్పూర్(టి) మండలం దరిగాంకు జానూబాయి, కెరమెరి మండలం పాట్నాపూర్కు చెందిన అన్నిబాయి జంటలకు సీఎం కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. అలాగే అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజనులపై ఉన్న అటవీ, పోలీసు కేసులను ఎత్తివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గిరిజన రైతుల భూములకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాను రెండు నెలల్లో కల్పిస్తామని స్వయంగా హామీ ఇచ్చారు.
మా బాధలను తీర్చిన దేవుడు కేసీఆర్..
జైనూర్, జూన్ 30 : మా ఊరిలో ఉన్న 1.04 ఎకరాల పోడు భూమిలో ఎవుసం చేసుకుంటున్నం. తెలంగాణ రాకముందు పోడు పట్టాలివ్వాలని నాయకుల సుట్టూ తిరిగినం. ఓట్లప్పుడచ్చి అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పిన్రు. ఆ తర్వాత మమ్ముల పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మాకు నమ్మకమచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు పోడు భూములకు పట్టాలిచ్చిన్రు. ఇయ్యాల ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేతుల మీదుగా నా భర్త సగునాథ్తో కలిసి పట్టా అందుకున్న. సార్ దగ్గరికి పోంగనే కొంత భయమనిపించింది. పట్టా ఇచ్చేటప్పుడు ఎక్కడ లేని సంతోషమనిపించింది. నా బిడ్డ పెండ్లి చేస్తే కూడా రూ. లక్ష ఇచ్చిన్రు. మా బాధలను తీర్చిన దేవుడు సీఎం కేసీఆర్ సార్.. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..
– మగాడే వనిత, మహిళా రైతు, అందుగూడ, ఆసిఫాబాద్
పట్టా వస్తుందని కలలో కూడా అనుకోలే..
సిర్పూర్(టీ), జూన్ 30 : నా పేరు సుర్పం జాగాడిరావు. మాది కాగజ్నగర్ మండలం మాలిని గ్రామం. గ్రామ శివారులో నాకు 4.08 ఎకరాల పోడు భూమి ఉంది. గత 50, 60 ఏళ్లుగా మా తాతలు, తల్లితండ్రులు అడవిలోని పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు. మా తరం కూడా ఈ పోడు భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఏన్నో ఏండ్లుగా మేము సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు రావు అనుకున్నం. కానీ సీఎం కేసీఆర్ సార్ వచ్చి మాకు పోడు భూములకు పట్టాలను ఇచ్చిండు. సీఎం వచ్చి మాకు పోడు పట్టాలు ఇస్తడని కలలో కూడా అనుకోలే. కానీ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలా వరమిచ్చినట్లుగా అనిపిస్తున్నది. పోడు పట్టానే కాకుండా రైతు బంధు కుడా ఇచ్చిండు. ఇంతకంటే సంతోషమేముంది. రైతు బంధు పైసలతో పత్తి విత్తనాలు కొని, పంట పండిస్త. ఇగ మాకు ఏండ్ల సంది ఉన్న కష్టాలు దురమైనయ్. శానాఏండ్ల నుంచి మమ్మల్ని ఎవరూ పట్టించుకోలే. బతుకుదెరువు కోసం పోడు భూములను నమ్ముకున్నం. మా నమ్మకాన్ని నిజం చేసి, మాకు పట్టాలు అందించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. గిరిజనుల గోడు విన్న సర్కారు వెంటే ఉంటాం.
మాకు ఎలాంటి రందీలేదు..
సిర్పూర్(టీ), జూన్ 30 : నా పేరు సుర్పం అనసూయ. మాకు కాగజ్నగర్ మండలంలోని మాలిని గ్రామ శివారులో 3.38 ఎకరాల పోడు భూమి ఉంది. ఏన్నో ఏండ్లుగా ఆ భూమి సాగు చేసుకుంటున్నా, పట్టా పాసు పుస్తకాలు లేక మస్తు ఇబ్బందులు పడ్డాం. రైతు బంధు, రైతు బీమా వంటివి వర్తించకపోవడంతో బాగ నష్టపోయినం. పంట పెట్టుబడికి సైతం కష్టంగా ఉండేది. యేటా వానకాలంలో దున్నుతున్నప్పుడు ఫారెస్ట్ వాళ్లు వచ్చి, మమ్మల్ని శానా ఇబ్బందులు పెడుతేండే వాళ్లు. మా గ్రామానికి పెద్దసార్ వాళ్లు వచ్చినప్పుడు మా గోసలు చేప్పుకొని ఏడ్చేవాళ్లం. అయినా మా బాధలు ఎవరూ పట్టించుకోలే. తెలంగాణ సర్కారు వచ్చినంక సీఎం కేసీఆర్ సారు మా పోడు భూములకు పట్టాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇగ ఇప్పుడు అసొంటి బాధలు ఉండయ్. బాజాప్తా మా భూముల్లో దున్నుకుంటాం. మాకు ఇష్టమైన పంటలు వేసుకుంటాం. ఇగ మాకు ఎలాంటి రందీ లేదు. ఇంతకాలం పడ్డ బాధలన్నీ పోయినయ్. రైతు బంధు, రైతు భీమా వస్తది. బ్యాంకుల్లో లోన్లు కుడా దోరుకుతయ్. ఇంతదూరం వచ్చి మాకు చేతికి పోడు పట్టాలు ఇచ్చిన సిఎం కేసిఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం..
కేసీఆర్సారు వల్లే జిల్లాకు మా తాత పేరు..
సిర్పూర్(యు) జూన్ 30 : మా తాత కుమ్రం భీం ఆదివాసుల హక్కుల కోసం పోరాడిండు. సీఎం కేసీఆర్ వల్లే మా తాతకు మంచి గుర్తింపు వచ్చింది. ఇది వరకున్న సర్కారోళ్లు మమ్ముల పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వా త సీఎం కేసీఆర్ మా కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. జోడెఘాట్ లో రూ. 26 కోట్ల తో మ్యూజియం నిర్మించిన్రు. జిల్లాకు మా తాత పెట్టిన్రు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్లుగా కాస్తు చేస్తున్న 4.39 ఎకరాల భూమి కి ఈ రోజు సీఎం కేసీఆర్ సారు పట్టా ఇచ్చిన్రు. ఇందుకు మస్తు సంబురమనిపించింది. మాకు నిజంగా కేసీఆర్ దేవుడే..
– కుమ్రం సోము, భీమ్ మనుమడు,పెద్ద ధోబ గ్రామ పటేల్, ఆసిఫాబాద్