సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి అని మరోమారు నిరూపితమైంది. కర్షకులపై తనకున్న ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. మిషన్ కాకతీయ, భగీరథతో నీటిగోసను తీర్చాడు. నిరంతర ఉచిత కరెంటుతో చీకట్లను పారద్రోలాడు. సాగులో తెలంగాణను ధాన్యాగారంగా మార్చాడు. రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుత పథకాలు అమలు చేస్తూ రైతుబాంధవుడిగా మారాడు. విత్తనాలు, ఎరువుల కొరత తీర్చి నకిలీ బెడదలేకుండా చేశాడు. కేంద్ర సర్కారు కొనకున్నా.. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ‘మా సర్కారు అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు మాఫీ చేస్తాం.. రుణాలు చెల్లించకండి’ అని ప్రకటించిన ప్రతిపక్షాలకు చెంపపెట్టులా ఒకేసారి మాఫీ చేసి చూపించాడు. తాజాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘లక్ష’ణంగా రుణమాఫీ చేసి అన్నదాతల పాలిట దేవుడయ్యాడు. ఇప్పటికే రెండు విడుతలుగా మాఫీ చేయగా.. తాజాగా పది రోజుల క్రితం నుంచి మూడో విడుతగా మాఫీ చేస్తూ వస్తున్నాడు. 45 రోజుల్లో తీరుస్తానని మాట ఇవ్వగా.. పది రోజుల్లోనే కట్టేశాడు. నెల రోజుల సమయం ఉండగానే రుణగోస తీర్చాడు. సీఎం కేసీఆర్ మాటంటే అమలు చేస్తాడని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – మంచిర్యాల, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యావత్ దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అపురూప ఘట్టానికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రూ.లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. రుణమాఫీ చేయనే చేయరు.. రైతులను మోసం చేసేందుకే ప్రకటన చేశారు. రూ.లక్ష వరకు మాఫీ చేసేన్ని డబ్బులే లేవు. అని రైతులను ఆగం చేసే కుట్రలు పన్నిన ప్రతిపక్షాల వ్యాఖ్యలకు చెంపపెట్టులా ప్రకటన వెలువడిన పది రోజుల్లోనే రుణమాఫీ చేసి చూపించింది తెలంగాణ సర్కార్. రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నెలబెట్టుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలలో కూడా ఊహించని విధంగా రుణ మాఫీ అవుతుండడంతో రైతుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగానే సోమవారం సీఎం కేసీఆర్ లక్షకు ఒక రూపాయి తక్కువ రూ.99,999 వరకు మాఫీ చేశారు.
లక్షలాది మంది రైతులకు వేలాది కోట్లు మాఫీ
రాష్ట్రవ్యాప్తంగా 9,02,843 మంది రైతులకు సంబంధించి రూ.5,809.78 కోట్లను విడుదల చేశారు. ఈ నెల రుణమాఫీ ప్రకటన వెలువడిన మరుసటి రోజు రూ.41వేల లోపు రుణాలున్న 62,758 మంది రైతులకు రూ.237.85 కోట్లు, ఈ నెల 4వ తేదీన రూ.43వేల లోపు రుణాలున్న 31,339 మంది రైతులకు రూ.126.5 కోట్లు, ఈ నెల 11వ తేదీన రూ.50వేల లోపు బకాయిలున్న 82,781 మంది రైతులకు రూ.371.93 కోట్లు మాఫీ చేశారు. తాజాగా ఆగస్టు 14వ తేదీన ఒకే రోజు 9,02,843 మంది రైతుల ఖాతాల్లోకి రూ.99,999 ఆన్లైన్లోనే నగదు బదిలీ జరిగింది. దీంతో మొత్తంగా ప్రకటన వెలువడిన పది రోజుల్లోనే 10.79 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఆగస్టు 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 2,095 మంది రైతులకు సంబంధించి రూ.93.52 కోట్లు మాఫీ అయ్యాయి. అంతకుముందు రెండు విడుతల్లో రూ.35 కోట్ల వరకు మాఫీ జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 54,047 మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోనూ రూ.లక్ష లోపు రుణాలన్నీ మాఫీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ సంతోషాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ 35,623 మంది రైతులకు రూ.207.56 కోట్లు మాఫీ అయ్యాయి. నిర్మల్ జిల్లాలో లక్ష లోపు మాఫీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ సంతోషాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
రుణం మొత్తం మాఫైందని సార్లు చెప్పిన్రు
ఖానాపూర్, ఆగస్టు 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిండు. నేను 2018లో ఎస్బీఐ బ్యాంకులో రూ. 56,688 అప్పుగా తీసుకొని భూమి చదును చేయించుకున్న. రుణం మొత్త మాఫీ అయినట్లు బ్యాంకు సార్లు చెప్పిన్రు. మస్తు సంబురమైతంది. తెలంగాణ రాకముందు నీళ్లుంటే.. కరెంట్.. కరెంట్ ఉంటే.. నీళ్లుండేటివి కావు. విత్తనాలు, ఎరువుల కోసం లైన్లు కట్టేటోళ్లం. ఎవుసమంటేనే భయమయ్యేది. తెలంగాణ వచ్చినంక బతుకులు మారిపోయినయ్.. సీఎం కేసీఆర్ పుణ్యమాని రైతులు రాజుల్లాగా బతుకుతున్నరు. మా రైతులందరం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటం. ఆయనను తప్పా ఇంకెవ్వరినీ నమ్మం.
– రామిడి నర్సయ్య, రైతు, ఖానాపూర్
రూ. 93 వేలు మాఫీ అయినట్లు మెస్సేజ్ వచ్చింది
తానూర్, ఆగస్టు, 16 : తెలంగాణ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేయడం సంతోషంగా ఉంది. నేను 2018లో హంగిర్గా సొసైటీలో రూ. 93 వేల పంట రుణం తీసుకున్న. మొత్తం మాఫీ అయినట్లు ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. మస్తు సంతోషపడ్డా. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల దేవుడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకా లు తీసుకొచ్చి కన్నీళ్లు తుడిసిండు. రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. రైతులు కేసీఆర్ను ఎప్పుడూ మదిలో ఉంచు కుంటారు. గతంలో రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు.
– చుక్కబొట్ల గంగాధర్, రైతు, బెంబర్
రూ. 70 వేల అప్పు తీర్చడమంటే మాటలు కాదు
నెన్నెల, ఆగస్టు16 : నాకు మా ఊరిలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. 2018లో రూ. 70 వేల అప్పు తీసుకున్న. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రుణం మాఫీ చేసిండు. ఇయ్యాల్నే నా సెల్ఫోన్కు మెస్సేజ్ కూడా వచ్చింది. బ్యాంకుసార్లు పిలిచి అప్పు తీరిందని చెప్పిన్రు. రూ. 70 వేల అప్పు తీర్చడమంటే మాటలు కాదు. ఏడాది కష్టం చేసినా గా పైసలు రావు. మాకు మంచి చేసిన సీఎం కేసీఆర్ సార్కు ఎప్పటికీ రుణపడి ఉంట. ఆదుకునే వాడు అండగా ఉన్నాడన్న ధీమా ఉంది.
– ఆనందపు రాజన్న, ఆవుడం
రూ. 96 వేల రుణం మాఫైంది
వాంకిడి,ఆగస్టు 16 : నేను బ్యాంకులో రూ. 96 వేల రుణం తీసుకున్న. మొత్తం రుణం మాఫీ చేసిన్రు. సీఎం కేసీఆర్ రైతుల బాగు కోసం ఎంతో కష్టపడుతున్నడు. గిసొంటి సీఎంను ఇంత వరకు సూడలేదు. గాయన సల్లంగుండాలె. ఇదివరకున్న సర్కారోళ్లు చేసింది లేదు కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేనిపోని మాటలు అంటున్నరు.
– సెండే మనుయాయి, రైతు, ఖమాన
కేసీఆర్కే పట్టం కడ్తం
తాంసి, ఆగస్టు 16 : నాకు ఎకరంన్నర భూమి ఉంది. తెలంగాణలో రైతుల కష్టాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రుణాలు మాఫీ చేసిండు. ఏడాదిలో రెండు పంటలకు పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నడు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తుండు. తెలంగాణ రాకముందు ఎవుసం ఆగమాగం ఉండేది. సాగునీరు, కరెంట్, ఎరువుల కోసం అష్టకష్టాలు పడ్డం. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా బతుకులు బాగు చేసిండు. నేను రూ.72 వేల రుణం తీసుకున్న. మొత్తం మాఫీ అయ్యింది. మళ్లీ ఆయనకే పట్టం కడ్తం.
– ఈ. భోజన్న, రైతు పొన్నారి
మొత్తం మాఫీ చేసిన్రు..
లక్ష్మణచాంద, ఆగస్టు 16 : నా పేరు తప్పిని రాజన్న. మా ఊరు పీచర. నాకు 14 ఎకరాల భూమి ఉంది. నేను వడ్యాల్ గ్రామీణ బ్యాంకులో రూ. లక్ష అప్పు తీసుకున్న. ప్రభుత్వం మొత్తం మాఫీ చేసింది. చాలా సంతోషంగా ఉంది. ఇగ మరో రూ. లక్ష రుణం తీసుకొని వ్యవసాయానికి వాడుకుంట. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రుణం మాఫీ చేశారు. రైతుల బతుకులు బాగు చేసిన గాయనకు రుణపడి ఉంటం.
బతికున్నంత కాలం తలుసుకంట
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లే నా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసిన్రు. నాకు 5 ఎకరాలు భూమి ఉంది, నేను 2018లో రూ. 90 వేల రుణం తీసుకున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష దాకా మాఫీ చేస్తానన్నడు. చెప్పినట్లే ఇప్పుడు మొత్తం మాఫీ చేసిన్రు. మాకు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ను బతికున్నంత కాలం తలుసుకుంట.
– ఆడ రాజు, రైతు, శంభుగూడ
గిసొంటి సీఎం ఉండాలె
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 16 : నేను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2018లో రూ. 65 వేల రుణం తీసుకున్న. ఎట్లా కట్టుడోనని రంది పడ్డ. ఇప్పుడు సీఎం కేసీఆర్ మొత్తం మాఫీ చేసిన్రు. రుణమాఫీ వల్ల మాలాంటి పేద రైతులకు ఎంతో మేలు జరిగింది. గిసొంటి సీఎం ఉన్నంత కాలం రైతులకు బాధ లేదు. రాజుల్లాగా బతుకుతరు.
– బోర్లకుంట సోము, రైతు లక్కారం
రూ. 60 వేల లోన్ మాఫైంది
దహెగాం,ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ సార్ రుణాలు మాఫీ చేస్తానని చెప్పిండు. నేను దహెగాం బ్యాంకులో రూ. 60 వేల క్రాప్ లోన్ తీసుకున్న. మొత్తం మాఫీ అయిందని బ్యాంకు మేనేజర్ సార్ చెప్పిండు. మస్తు సంతోషంగా ఉంది. ఇది వరకు మా గురించి పట్టించుకున్నోళ్లు లేకుండే. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక రైతులకు మంచి మేలు చేసిండు. రంది లేకుంట పంటలు వేసుకొని మంచిగ బతుకుతున్నం. మేమంతా సీఎం కేసీఆర్ సార్ వెంటే నడుస్తం. మళ్లా గాయనే సీఎం కావాలి.
-దుర్గం పెంటయ్య, కల్వాడ