ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. బదిలీలు, ఉద్యోగోన్నతులకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు కటాఫ్ తేదీని కూడా ముందుగానే ప్రకటించింది. రేపటి నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగించనున్నది. ఈక్రమంలో స్పౌజ్ కష్టాలకు కూడా చెక్ పెట్టనున్నది. ఇక ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వెలువడనుండగా, ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మంచిర్యాల, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ప్రభుత్వోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ 2018లో నిర్వహించారు. ఇక ఉద్యోగోన్నతులైతే 2015 నుంచి ఆగుతూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టాలంటూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రతిసారీ, కొందరు టీచర్లు వివిధ కారణాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ ఉత్తర్వులపై కోర్టు స్టే ఇవ్వడంతో అది ఆగిపోవడం జరుగుతున్నది. దీంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు బదిలీ అవుతామో.. ఎప్పుడు ప్రమోషన్ వస్తుందో అని ఎదురు చూడడం తప్ప చేసేది ఏం లేదని బాధపడుతున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బదిలీల కోసం 2023 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 5పై విధించిన సే ్ట విషయంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపడుతామని చెప్పింది. అలా చెప్పిందో లేదో దాన్ని ఆచరణలోకి తెస్తూ ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు బదిలీ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయనున్నది. దీనికి తోడు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగోన్నతులు సైతం ఇవ్వనుండడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టేను వెకేట్ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని కొనియాడుతూ, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని వేనోళ్ల పొగుడుతున్నారు.
తీరనున్న స్పౌజ్ కష్టాలు..
ఈ బదిలీలతో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న భార్యాభర్తల కష్టాలు తీరనున్నాయి. బదిలీల్లో స్పౌజ్ టీచర్లకు ఇచ్చే 10 పాయింట్లను యథాతథంగా కొనసాగించాలని కోర్టు సూచించింది. ఈ మేరకు బదిలీల్లో వీరికి న్యాయం జరగనున్నది. అలాగే ఉపాధ్యాయ సంఘం నాయకులకు ఇచ్చే 10 పాయింట్లను తొలగించమంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేయనున్నది. సెప్టెంబర్ ఒకటో తేదీ కటాఫ్ తేదీగా లాంగ్ స్టాండింగ్ ఉపాధ్యాయులకు ఎనిమిదేండ్లు, ప్రధానోపాధ్యాయులకు ఐదేండ్ల నిబంధన వర్తింపజేయనున్నారు. ఉద్యోగ విరమణకు మూడేండ్లలోపు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఇందుకు మినహాయింపు ఇచ్చారు. బదిలీల షెడ్యూల్ నేపథ్యంలో కొత్తగా మరోసారి దరఖాస్తులు, సవరణకు అవకాశం ఇచ్చారు. దీంతో పాటు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా రాష్ట్రవ్యాప్తంగా 15వేల మందికి ఉద్యోగోన్నతులు రానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 800 నుంచి వెయ్యి మందికి ఉద్యోగోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కటాఫ్ మార్చి న్యాయం చేసింది..
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పలుమార్లు కేసుకు హాజరై, స్టేను వెకేట్ చేయించడంలో కీలకపాత్ర పోషించింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. నాకు ఐదేండ్లు లాంగ్ స్టాండింగ్ అయ్యింది. నేను కూడా బదిలీ అవుతున్నా. గతంలో 2023, జనవరి 1వ తేదీ కటాఫ్ పెట్టారు. కానీ ఇప్పుడు మేం అడగకుండానే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2023కు కటాఫ్ తేదీని పెంచి ఉపాధ్యాయుల మనసులో ఉన్న కోరికను తీర్చగలిగింది. డిమాండ్, వినతి ఇవ్వకముందే వాళ్లే మార్చారు. రాష్ట్ర విద్యాశాఖ న్యాయపరమైన చిక్కులకు అవకాశం ఇవ్వకుండా, ఉపాధ్యాయుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ నిబంధనలు పకడ్బందీగా అమలు చేసి అర్హులైన ఉపాధ్యాయులను న్యాయం జరిగేలా చూడాలి.
– డాక్టర్ పార్వతీ సత్యనారాయణ, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వానికి ధన్యవాదాలు
రాష్ట్రంలోని 60వేల మంది ఉపాధ్యాయులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నది. దాదాపు 15 వేల మందికి ప్రమోషన్లు వస్తున్నయ్. మా కోసం కొట్లాడి బదిలీ, ప్రమోషన్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వానికి ధన్యావాదాలు. మందమర్రిలో ఎస్జీటీగా పని చేస్తున్న నాకు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తుంది. 12 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్న. ఇప్పుడు బదిలీ అవుతున్నది. ఒక్క మంంచిర్యాల జిల్లాలోనే సుమారు 350 నుంచి 400 మందికి ప్రమోషన్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది.
-ఇన్నారెడ్డి, పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు
బదిలీల షెడ్యూల్ హర్షనీయం
కుంటాల, సెప్టెంబర్ 1: బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రమోషన్లు, బదిలీలపై ఉన్న స్టే ఎత్తివేయడంతో ఎనిమిదేళ్లుగా మా ఎదురుచూపులకు ఈరోజు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ విడుదల చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. వెంటనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అనుకుంటున్న.
-తాటి గంగాదాస్, ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాల, గమ్మాపూర్ తండా, కుంటాల మండలం
పారదర్శకంగా పూర్తి చేయాలి
ఉపాధ్యాయులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు పదేళ్ల నుంచి ఉద్యోగోన్నతులు లేకపోవడం, బదిలీలు లేకపోవడం వల్ల చాలా నిరాశతో ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడం అందరిలో సంతోషాన్ని నింపింది. అయితే ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా పూర్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. త్వరగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అనుకుంటున్న. – ఏ.సతీశ్ కుమార్, హెచ్ఎం, జడ్పీహెచ్ఎస్ లింబా (కే)
ఆశ నెరవేరనుంది
కడెం, సెప్టెంబర్ 1: నా పేరు వినోద్ వర్మ. కడెం మండలంలోని లక్ష్మీసాగర్ ప్రభుత్వ పాఠశాలలో పదేళ్లుగా పని చేస్తున్న. నా మొదటి పోస్టింగ్ 2012లో ఇక్కడే. ఇన్నాళ్లకు మా ఆశ నెరవేరబోతు న్నది. మాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. 2018లో జరిగిన బదిలీల్లో పాయింట్లు తక్కువగా ఉండడం వల్ల నేను నా స్వస్థలం నిర్మల్కు వెళ్లలేకపోయాను. ప్రస్తుతం చేపట్టే బదిలీల్లో నేను నా సొంత మండలానికి వెళ్తున్న అని సంతోషంగా ఉంది. బదిలీలపై ఉన్న కేసులు కొట్టి వేసినందున ప్రభుత్వం ప్రమో షన్లు, బదిలీలు త్వరగా చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. 5 నుంచి 8 ఏండ్లు విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం బదిలీల ద్వారా మంచి అవకాశం కల్పించడం హర్షనీయం.