Singareni Elections | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీబీజీకేఎస్ దూకుడు పెంచింది. ఈ మేరకు గనులు, విభాగాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాధించిన హక్కులను వివరిస్తూ కార్మికులను ఓట్లు అభ్యర్థిస్తున్న ది. 2012లో తొలిసారి, 2017లో రెండోసారి గుర్తింపు హోదా పొందగా, ముచ్చటగా మూడోసారి ఘన విజయం సాధించి కేసీఆర్కు కానుక ఇచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నది.
బెల్లంపల్లి, డిసెంబర్ 24 : ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనుండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది. ఇక ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రతి కార్మికుడిని కలుస్తూ బాణం గుర్తుకు ఓటేసి టీబీజీకేఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. గత వారం నుంచి గనులు, వివిధ విభాగాల వద్ద జోరుగా ప్రచారం చేసిన నాయకులు ఆదివా రం కూడా కార్మికులు, ఉద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సాధించిన హక్కులు, సౌకర్యాలను వివరిస్తూ ఓట్లు అడిగారు. ప్రధానంగా మందమర్రి ఏరియా శాంతిఖని గనిపై టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కో నాయకుడు 50 మంది కార్మికులను కలువాలని ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రతి రోజూ మూడు షిప్టుల్లో కార్మికులను కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఏ రిలే, బీ రిలే, సీ రిలే కార్మికులతో కలిసి మాట్లాడుతున్నారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయభేరి మోగించి కేసీఆర్కు గిఫ్ట్గా ఇవ్వాలని నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ సింగరేణికి చేసిన మేలును వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కారుణ్య నియమాకాల ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నటీ లీవ్లు, అన్ని మతాల పండుగలకు పెయిడ్ హాలిడే, ఐఐటీ, ఐఐఎంలలో సీటు సాధించిన కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇల్లు కట్టుకునే వారికి రూ.10 లక్షల వడ్డీలేని రుణం, సింగరేణి ఏరియాల్లో నివసించే వారికి పట్టాల పంపిణీ, డ్యూటీలో మృతి చెందిన కార్మికుడికి రూ. 20 లక్షల పరిహారం, రిటైర్డ్మెంట్ వయసు 61కి పెంపువంటివి వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత సూచనలతో అధ్యక్షుడు వెంకట్రావ్,ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య నాయకత్వంలో మూడోసారి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సింగరేణి అభివృద్ధికి కేసీఆర్ సర్కారు ఎంతో కృషి చేసింది. కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలు తిరిగి సాధించుకున్నాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఎవరూ అధైర్య పడవద్ద.. మూడోసారి విజయం మనదే. సీరియల్ సంఖ్య-9, బాణం గుర్తుకు ఓటు వేసి టీబీజీకేఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. కేసీఆర్కు గిఫ్ట్గా ఇచ్చి రుణం తీర్చుకుందాం. – దాసరి శ్రీనివాస్, గని పిట్ కార్యదర్శి