Swimming | దండేపల్లి, మే 7 : వేసవి కాలంలో పిల్లలతోపాటు పెద్దలూ ఈతకు వెళ్లడానికి సరదా పడుతుంటారు. ఈత రాకున్నా చెరువులు, కాలువలు, కుంటలు, వ్యవసాయబావుల్లో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకొని కారణంగా.. ఈ సరదా ప్రాణాలు హరిస్తున్నది. దీనికి సరైన ప్రావీణ్యం లేకపోవడమే కారణం.
జాగ్రత్తలు లేకే ప్రమాదాలు..
విద్యార్థులకు సెలవులు వచ్చినప్పటి నుంచి ప్రమాదాలు పెరుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. బావులు, కుంటలు, కాల్వల్లోకి దిగి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన ఒర్సు మల్లేశ్(22) అనే యువకుడు మార్చి 29న తానిమడుగు సమీపంలోని గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద తన స్నేహితులతో కలిసి కడెం కాలువలో స్నానం చేస్తుండగా నీట మునిగాడు. అలాగే ఏప్రిల్16న జన్నారం మండలంలోని తపాల్పూర్ గ్రామానికి చెందిన మొడికె మౌర్యతేజ(14) నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈతకు వెళ్లాడు. ఈత రాక మునిగి చనిపోయాడు. ఈనెల 24న ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తర్నం గ్రామానికి చెందిన దుర్గం హరీశ్(14) ముగ్గురు స్నేహితులతో కలిసి కడెం వాగు చెక్ డ్యాంలో ఈత రాక నీట మునిగి చనిపోయాడు.
ఇవి పాటించాలి..
ఈత పూర్తిగా వచ్చిన వారి సహకారంతో లోతు తక్కువగా ఉన్న ప్రదేశంలో మాత్రమే నేర్చుకోవాలి. ఈత రాని వారు తప్పనిసరిగా స్విమ్మింగ్ జాకెట్లు ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవీ ఉండవు కాబట్టి.. తుంగ, జీలుగ బెండ్లను కట్టగా చేసుకొని వీపునకు కట్టుకొని నీటిలోకి వెళ్లాలి. ద్విచక్ర వాహనాల ట్యూబ్లలో గాలి నింపుకొని శిక్షణ పొందవచ్చు. చిన్న పిల్లలు, 14 ఏండ్ల లోపు ఉన్నవారు చెరువులు, బావుల్లోకి దిగకూడదు. చెరువులు, కాలువల్లో మట్టి కోసం తీసిన గోతులు నీటి అడుగులో ఉండడం వల్ల మనకు కనిపించవు. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలి. చెరువుల్లో చేపల కోసం అమర్చిన వలలు ఉంటాయి. అందులో కూడా చిక్కుకుని ప్రమాదం తెచ్చుకునే అవకాశం ఉంది. చెరువుల్లో బురద అధికంగా ఉండే అవకాశం ఉండడంతో అక్కడ కాళ్లు పూడుకుపోయి పైకి వచ్చే పరిస్థితి ఏ మాత్రం ఉండదు. కాబట్టి చెరువు గురించి పూర్తి అవగాహన ఉంటేనే అందులోకి వెళ్లాలి. చెరువు, కాల్వల్లో తామర తీగలు ఉన్న ప్రాంతాల్లో ఈతకు వెళ్లకూడదు.
కాల్వలు ప్రమాదకరం..
కాల్వల్లో నీటి ప్రవాహ వేగం గురించి అంచనా వేయలేం. అందులో ఈత వచ్చిన వారు దిగినా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇక రాని వాళ్లు ఈతకు వెళ్లక పోవడమే మంచిది. కాల్వ గేట్ల వద్ద నీరు పైకి నిశ్చలంగా కనిపించినా కింది భాగంలో ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. ఈతకు దిగక పోవడమే శ్రేయస్కరం. పాడుబడిన బావుల్లోకి వెళ్లకూడదు. వీటి దరులు కూలిపోయే అవకాశం ఉంది. అలాగే బావుల్లో కార్బన్ డయాక్సైడ్ వ్యాపించి ఉండవచ్చు.
నీటిలో పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చెరువులు, కాలువల్లో పడి చిక్కుకు పోయిన వ్యక్తిని గుర్తించి బయటకు తీయగానే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించాలి. గుండె కొట్టుకోకుంటే చాతిపై నొక్కాలి. వీలైనంత త్వరగా సమీప దవాఖానకు తరలించాలి. నీటిలో నుంచి బయటకు తీయగానే వెంటనే పడుకోబెట్టాలి. పొట్టపై మెల్లిగా నొక్కి నీళ్లను బయటకు తీయాలి. బాధితుడికి శ్వాస ఆడకపోతే తోటి వ్యక్తుల నోటి ద్వారా శ్వాస అందించాలి. ప్రథమ చికిత్స సమయంలో బాధితుడిని ప్రశాంతమైన, విశాలమైన ప్రాంతంలో ఉంచాలి. దవాఖానలో అర్హులైన వైద్యులచే చికిత్స అందించాలి.