నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 30 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధితో పాటు క్రీడలకు సైతం పెద్దపీట వేస్తున్నది. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు వారిలో మానసిక ఉల్లాసం నింపేందుకు క్రీడలను నిర్వహించాలని నిర్ణయించింది. వేసవి క్రీడా శిక్షణ పేరుతో ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో శిబిరాలను నిర్వహించనున్నది. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. చదువు విలువను గుర్తు చేస్తూనే ఆటల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో అంది వచ్చే అవకాశాలను సైతం వివరించి వారికి ఇష్టమైన క్రీడలో నెల రోజుల పాటు తర్ఫీదు ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా పీఈటీలు, పీడీలను సైతం సిద్ధం చేశారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో సోమవారం నుంచి జిల్లాలో వేసవి శిక్షణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్ వరుణ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో వీటిని నెల రోజుల పాటు విజయవంతంగా నిర్వహించి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా సంసిద్ధులను చేయనున్నారు.
నేటి నుంచి నెల రోజుల పాటు క్రీడలు
జిల్లాలోని క్రీడాకారుల సౌకర్యార్థం మే 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రభుత్వం క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ అందించనున్నారు. నిర్మల్ జిల్లాలోని 110 గ్రామ పంచాయతీల పరిధిలో.. మున్సిపాల్టీల పరిధిలైన నిర్మల్, భైంసా, ఖానాపూర్ ప్రాంతాల్లో మొత్తం 16 కేంద్రాల్లో క్రీడలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. అర్బన్ పరిధిలోని శిక్షణ కేంద్రాల్లో మార్షల్ ఆర్ట్స్, యోగా, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, క్యారం, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనుండగా.. గ్రామ పంచాయతీ (రూరల్) పరిధిలో వాలీబాల్, క్రికెట్, చెస్, క్యారం, ఖోఖో, కబడ్డీ వంటి అంశాల్లో పీఈటీలు, పీడీల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రైవేట్ శిక్షణ శిబిరాలకు దీటుగా..
వేసవి శిక్షణ శిబిరాలు అనగానే ఠక్కున ప్రైవేట్వే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఈ శిక్షణ శిబిరాలను నిర్వహించదనే నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్నది. దీంతో కొన్ని సంవత్సరాల (కరోనా కంటే) ముందు నుంచే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ పేద, మధ్యతరగతి క్రీడాకారులకు ఆసరాగా నిలుస్తున్నది. ప్రైవేట్ శిక్షణ శిబిరాల్లో వేలకువేలు ఫీజులు వసూలు చేసి కేవలం ధనార్జనే ధ్యేయంగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ధనవంతుల పిల్లలు మాత్రం ఫీజులకు వెనుకాడకుండా ఈ శిక్షణ శిబిరాలను వినియోగించుకుంటూ వేసవిని వెల్లదీస్తున్నారు. కాగా, పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడంతో క్రీడాకారులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలతో పాటు సబ్జెక్టులపై అవగాహన..
క్రీడలతో పాటు ప్రభుత్వం వివిధ సబ్జెక్టులపై సైతం అవగాహన కల్పించనున్నది. వేసవి సెలవుల్లో చదువును నిర్లక్ష్యం చేయకుండా వెనుకబడిన సబ్జెక్టుల్లో విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేలా సైతం చర్యలు చేపట్టింది. వేసవి శిబిరాల్లో భాగంగా విద్యార్థులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. అనంతరం ఉదయం 9-10 గంటల వరకు గణితం, ఆంగ్లం, విజ్ఞాన శాస్ర్తాలపై అవగాహన కల్పించనున్నారు. ఆటలతో పాటు ముఖ్యమైన మూడు సబ్జెక్టుల్లో పట్టు సాధించేందుకు ఇలాంటి శిక్షణ ఎంతో దోహదం చేస్తుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రతి జిల్లాకు నిధులను కేటాయించింది. నిర్మల్ జిల్లాకు రూ.1.05 లక్షలు మంజూరు చేసింది. క్రీడా పరికారాల కొనుగోలు, శిక్షణ అందించిన కోచ్లు, శిక్షణలో గాయాలైన వారికి చికిత్స అందించేందుకు మెడికల్ కిట్లు, ఇతర ఖర్చులకు ఈ నిధులను వినియోగించనున్నారు.
శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి 31 వరకు నెల రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించే క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. వేసవి శిక్షణ శిబిరాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. శిక్షణ జరిగే ప్రాంతాల్లో క్రీడాకారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పీఈటీ, పీడీలను ఆదేశించాం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, మరుగున పడుతున్న క్రీడాకారులను వెలికితీసేందుకు నిర్వహించే ఈ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎంచుకున్న క్రీడలో నైపుణ్యం సాధించి రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు నిలబెట్టాలి.
– క్రాంతి కుమార్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి, నిర్మల్