నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 29 : నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా అమరవేణి నర్సాగౌడ్ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ముడుసు సత్యనారాయణ జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారన్నారు. సత్యనారాయణతోపాటు అమరవేణి నర్సాగౌడ్ ఈ పదవిలో ఉంటారన్నారు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీరిద్దరి సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించామన్నారు.
కర్ణాటకలో ఐదు గంటలే కరెంటు ఇస్తున్నామని సాక్షాత్తు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అన్నారు. ఆదివారం బేస్తవార్పేటలో వంజర సంఘం బ్రహ్మపురిలో కత్రి సంఘాలు నిర్వహించిన సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కర్ణాటకలో రైతులు, పారిశ్రామికవేత్తలు కరెంటు కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో అన్ని సంఘ భవనాలు నిర్మించుకుంటామన్నారు.