రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ‘ఉపాధి’ కూలీలకు బీమాతో భరోసానిస్తున్న సర్కారు, తాజాగా మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. గతంలో గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాలను, ప్రస్తుతం రూ.2 లక్షలకు పెంచింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12,39,323 మందికి ఈ పాలసీ వర్తించనున్నది.
మంచిర్యాల, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కష్టాన్నే నమ్ముకొని.. గుట్టలు, పొలాలు, చెరువుల్లో పని చేసే ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఊరట కలిగించే వార్త చెప్పింది. పని ప్రదేశంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి కూలీలు తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాన్ని పొందుతున్నారు. మరికొన్నిసార్లు పాములు, తేల్ల కాటుకు గురై మృత్యువాత పడే ప్రమాదం సైతం పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలో కూలీకి బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నది. గతంలో గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న బీమాను ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12,39,323 మంది కూలీలకు ఈ బీమా కవరేజ్ వర్తించనున్నది.
నాలుగు రకాలుగా బీమా కవరేజ్..
ఉపాధి కూలీలకు వైద్య సదుపాయాలు, ప్రమాదం బారిన పడితే ఇచ్చే పరిహార మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ఉపాధి కూలీలకు నాలుగు రకాలుగా ఈ బీమా వర్తింపజేయనున్నది.
యాక్టివ్గా 7.85 లక్షల మంది..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 12.39 లక్షల మంది ఉపాధి కూలీలుండగా, వీరిలో 7.85 లక్షల మంది యాక్టివ్ కూలీలుగా ఉన్నారు. ఆదిలాబాద్లో 2,19,585, ఆసిఫాబాద్లో 1,75,902, మంచిర్యాలలో 1,54,980, నిర్మల్లో 2,35,124 మంది నిత్యం ఉపాధి పనులకు వస్తున్న వారే ఉన్నారు. యాక్టివ్గా ఉన్నా.. లేకున్నా.. జాబ్కార్డు కలిగి ఉండి పని ప్రదేశంలో గాయపడిన ఎవరికైనా సరే బీమా వర్తిస్తుందని మంచిర్యాల డీఆర్డీవో శేషాద్రి తెలిపారు. గతంలోనూ చాలా మంది రూ.50 వేల బీమా ైక్లెమ్ చేసినవారు ఉన్నారన్నారు.
కుటుంబానికి భరోసా
దండేపల్లి, అక్టోబర్ 13 : సర్కారు ఉపాధి కూలీలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. గతంలో ఇన్సూరెన్స్ రూ.50 వేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు చెబుతున్నరు. ఇది సరైన నిర్ణయం. మా ఇంటిల్లిపాది 100 రోజుల పనికి వెళ్తాం. అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబానికి భరోసా ఇచ్చినట్లు ఉంటుంది.
– గడ్డం భీమయ్య, జైతుగూడ(దండేపల్లి)
గొప్ప నిర్ణయం
కోటపల్లి, అక్టోబర్ 13 : ఉపాధి కూలీలకు బీమా డబ్బు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. ఇది వరకు ఉపాధి పనులు చేస్తూ మరణించిన కూలీ కుటుంబానికి రూ.50 వేలు మాత్రమే ఇచ్చేటోళ్లు. ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచారు. ఈ పథకంతో పేదోళ్లకు మరింత భరోసా పెరుగుతుంది.
– యాదవ్, మల్లంపేట (కోటపల్లి)