కడెం, మే 13 : కవ్వాల్ అభయారణ్యంలోని ఇస్లాంపూర్కు రోడ్డు లేక గిరిజనం అష్టకష్టాలు పడుతుండగా, బీఆర్ఎస్ సర్కారు రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దాల ‘దారి’ధ్య్రాన్ని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కేంద్ర సర్కారు మాత్రం అనుమతుల పేరిట అడ్డుపుల్లలు వేస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ గ్రామ పంచాయతీని సీఎం కేసీఆర్ ప్రగతి బాట పట్టించి ఆదర్శంగా తీర్చిదిద్దగా, కేంద్ర అటవీశాఖ కనీసం మా గోడును పట్టించుకోవడం లేదని అడవిబిడ్డల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
కవ్వాల్ అభయారణ్యంలో నివాసముంటున్న మారుమూల గిరిజన గ్రామం ఇస్లాంపూర్. వాగులు, వంకలు, గుట్టలు దాటితేగాని ఈ గ్రామానికి చేరుకోలేము. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ఈ గ్రామాన్ని ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది.
ఇక్కడ 107 కుటుంబాలు ఉన్నాయి. 465 మందిలో 291 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 138 మంది పురుషులు, 153 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడి గిరిజనులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. పత్తి, మక్క, పెసర తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఉడుంపూర్ గ్రామం మీదుగా అటవీమార్గం నుంచి వాగులు, వంకలు, గుట్టలు దాటుతూ 10 కిలోమీటర్ల దూరం వెళ్తే ఇస్లాంపూర్కు చేరుకోవచ్చు. అటు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం. రోడ్డుమార్గం లేక ఇక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వానకాలం వచ్చిందంటే చాలు బాహ్యప్రపంచంతో సంబంధం ఉండదు. వాగులు ఉప్పొంగుతాయి. అడుగుతీసి అడుగువేయకుండా బురదమయమవుతుంది. వానకాలం ముగిసే వరకు ఒకేసారి సరుకులు కొనుగోలు చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఇటు ఉడుంపూర్కు, అటు కవ్వాల్కు దారి లేక ప్రజలు గ్రామం నుంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఉంటుంది.
రాష్ట్రం రోడ్డుకు నిధులిస్తే..అనుమతులివ్వని కేంద్రం
ఇస్లాంపూర్ ప్రజల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర అటవీశాఖ ఇందుకు అనుమతులను నిరాకరించింది. అటు ఉడుంపూర్ నుంచి.. ఇటు కవ్వాల్ నుంచి రోడ్డు నిర్మించే వీలుండగా, అటవీఅధికారులు అనుమతులు ఇవ్వలేదు. ఈ క్రమంలో స్వచ్ఛందంగా గ్రామస్తులు ముందుకొచ్చి రోడ్డు నిర్మించే క్రమంలో.. కేసులు నమోదు చేస్తామంటూ అధికారులు హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గారు. నిర్మల్ జిల్లాలోని 30కి పైగా గ్రామాలకు రోడ్డు, విద్యుత్ సౌకర్యం కోసం కలెక్టర్లు అనేకసార్లు కేంద్రానికి లేఖలు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ సొంత రిస్క్ ద్వారా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, ఖానాపూర్, పెంబి మండలాల్లోని అనేక గ్రామాలకు సింగిల్ఫేజ్ విద్యుత్ను సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. సింగిల్ఫేజ్ విద్యుత్ అందిస్తున్న చోట త్వరలోనే త్రీఫేజ్ కరంట్ను కూడా అందించేలా ప్రణాళిక చేస్తున్నారు.
పుట్టిపెరిగిన ఊరును వదలని గిరిజనులు
అటవీప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి రావాలని ఇక్కడి గిరిజనులను అధికారులు కోరగా, వారు నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు కోసం వెచ్చించే నిధుల నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల చొప్పున అందిస్తామని, ప్రతి కుటుంబానికీ రెండెకరాల భూమి ఇస్తామని చెప్పినా వారు ఒప్పుకోలేదు. పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలి రాలేమని, చివరి వరకు ఇక్కడే జీవిస్తామని స్పష్టం చేశారు.
ఆగని ప్రగతి.. అందుతున్న పథకాలు
ఇస్లాంపూర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. గ్రామానికి సరైన దారి లేకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మాత్రం ఆగడం లేదు. శ్మశాన వాటిక నిర్మాణం, డంప్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్డు, విలేజ్ పార్క్, రూ. 16 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ట్యాంక్, ట్రాలీ వంటివి అందుబాటులోకి వచ్చాయి. 28 మందికి ప్రతి నెలా రూ. 2 వేల చొప్పున రూ. 56 వేల ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. ముగ్గురికి వికలాంగ పింఛన్ రూ. 9 వేలు పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో 92 మంది రైతులకు 309 ఎకరాల భూమి ఉంది.
ఒక్కో సీజన్లో రైతుబంధు ద్వారా రూ. 15.45 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అలాగే ఓ రైతు చనిపోతే రైతు బీమా ద్వారా రూ. 5 లక్షలను అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇక అవసరమైన త్రీఫేజ్ విద్యుత్ సరఫరాతో పాటు సాగునీటి కోసం చెరువు నిర్మాణం చేపడుతామని, రేషన్ ఇచ్చేలా జీసీసీ కేంద్రం ఏర్పాటు చేయిస్తామని, అంగన్వాడీ కేంద్రానికి ఆయాను నియమించడంతో పాటు రేషన్ ద్వారా అంగన్వాడీ సరుకులను గ్రామానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.