ఎదులాపురం/ఆసిఫాబాద్/నిర్మల్ టౌన్/హాజీపూర్, జనవరి16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యార్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, సీఎస్ శాంతికుమారి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ నుంచి డీజీపీతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు, వైద్య, పంచాయతీ, పురపాలక సంఘాలు, తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు మలివిడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 19న జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 19న ఉదయం 8.45 గంటలకు తప్పనిసరిగా ఆయా బృందాల సభ్యులు క్యాంపుల వద్దకు చేరుకోవాలని ఆదేశించారు. క్యాంపుల తేదీలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.
క్యాంపుల్లో కంటి పరీక్షలు చేయించు కునేలా మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించా లన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కోసం అన్ని క్యాంపుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కళ్లజోళ్లు అందించాలన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పాల్గొని మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, బృందాలను నియమించడంతో పాటు శిబిరాల నిర్వహణకు అవసరమైన సామగ్రి, మందులు, కంటి అద్దాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లాలో 40 బృందాలు, ఒక అదనపు బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎస్పీ జీవన్రెడ్డి, డీపీవో శ్రీలత, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, మంచిర్యాల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి ఫణీందర్, జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.