చెన్నూర్, ఏప్రిల్ 27 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభలను తలపిస్తున్నాయి. మండలాలు, మున్సిపాలిటీలవారీగా సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. సమ్మేళనాలకు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు చెన్నూర్, జైపూర్, కోటపల్లి మండలాలతోపాటు, చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో సమ్మేళనాలు జరిగాయి.
ఈ నెల 11న చెన్నూర్ పట్టణంలో జరిగిన చెన్నూర్ మండల ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు 6 వేల మంది.. ఈ నెల 12న జైపూర్లో జరిగిన జైపూర్ మండల సమ్మేళనానికి దాదాపు 7,500 మంది.. 20న చెన్నూర్లో జరిగిన కోటపల్లి మండల సమ్మేళనానికి దాదాపు9 వేల మంది.. 21న చెన్నూర్లో జరిగిన చెన్నూర్ మున్సిపాలిటీ సమ్మేళనానికి దాదాపు 4,500 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమ్మేళనాలకు భారీగా నాయకులు, కార్యకర్తలు తరలి వస్తుండడంతో సమావేశాలు బహిరంగ సభలను తలపిస్తున్నాయి. సమావేశాలకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్తోపాటు ముఖ్య అతిథులు పాల్గొంటుండగా కోలాటాలు, బోనాలు, డప్పు చప్పుళ్లతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.
రెండు సెషన్స్గా నిర్వహణ
ఆత్మీయ సమ్మేళనాలు రెండు సెషన్స్గా నిర్వహిస్తున్నారు. మొదట ఉదయం 10:30 గంటలకు ప్రారంభించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్నారు. అనంతరం ముఖ్యనాయకులు ప్రసంగించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని కోరుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం.. 2:30 గంటల నుంచి మండలాలైతే గ్రామాలవారీగా, మున్సిపాలిటీలైతే వార్డులువారీగా విప్ సుమన్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఇలా సమావేశాలు రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతున్నాయి.
వినూత్న రీతిలో ఆహ్వానాలు
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా సమ్మేళనాలకు రావాల్సిం దిగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు వినూత్నంగా ఆహ్వానాలు పలుకుతు న్నారు. గ్రామాలు, వార్డుల్లో గులాబీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ బొట్టు పెట్టి రావాల్సిందిగా కోరుతున్నారు. దీంతో పిలుపునందుకున్న ప్రతి కార్యకర్త సమ్మేళనాలకు తరలి వస్తున్నారు.
సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు
చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న సమ్మేళనాల నివేదికలు, ఫొటోలు, వీడియోలను నిఘా సంస్థల ద్వారా తెప్పించుకొని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భారీ బహిరంగ సభలను తలపిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 81 శాతం అనుకూలంగా రావడం, బహిరంగ సభలను తలపిస్తూ సమ్మేళనాలు జరుగుతుండడంతో సీఎం కేసీఆర్ నుంచి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశంసలు అందుకున్నారు.
సకల సౌకర్యాలు
భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వస్తుండడంతో ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పెద్ద కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాగు నీటి వసతి కల్పిస్తున్నారు. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చేపల కూరతోపాటు ఇతర కూరగాయలతో రుచి కరమైన భోజనాన్ని పెడుతున్నారు. జిలేబీ, గులాబ్ జామ్ లాంటి స్వీట్లతో ఫ్రూట్ సలాడ్, ఐస్క్రీంలను కూడా ఇస్తున్నారు.
మళ్లీ నేటి నుంచి..
మున్సిపాలిటీలు, మండలాల్లో నేటి(శుక్రవారం) నుంచి సమ్మేళనాలు నిర్వహించనున్నారు. నేడు మందమర్రి మున్సిపాలిటీ, 29న క్యాతన్పల్లి మున్సిపాలిటీ, మే 2న భీమారం మండలం, 3న మందమర్రి మండలానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనాలు జరుగనున్నాయి.